నగరంలో సందడి చేసిన ‘రక్షాబంధన్‌ ’ మూవీ టీమ్

నగరంలో సందడి చేసిన ‘రక్షాబంధన్‌ ’ మూవీ టీమ్

బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రక్షాబంధన్‌’. ఇందులో హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పలు నగరాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాజాగా హైదరాబాద్‌లో ‘రక్షాబంధన్‌ ’ మూవీ టీమ్ సందడి చేసింది. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ బృందం హైదరాబాద్‌ వచ్చింది. 

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే చిత్ర బృందం దుబాయ్‌, పూనె, ఇండోర్‌లలో సందడి చేసింది. ఈ బృందంలో అక్షయ్‌కుమార్‌, నిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, చిత్ర తారాగణంలో సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. ఇండోర్‌ పర్యటన తరువాత, ఈ చిత్ర బృందం హైదరాబాద్‌కు వచ్చింది. పీవీఆర్‌ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వీరు చార్మినార్‌ వద్ద సందడి చేశారు. హైదరాబాద్‌కు తలమానికమైన చార్మినార్‌ వద్ద ఫోటోలు దిగారు. తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు.

ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ తీసుకున్నాయి. హిమాంశు శర్మ, కనికా ధిల్లాన్‌లు రచన చేయగా, రక్షాబంధన్‌కు హిమేష్‌ రేష్మియా సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు. రక్షాబంధన్‌ చిత్రంలో భూమి పద్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, నీరజ్‌ సూద్‌, సీమా పహ్వా, సాదియా ఖతీబ్‌, అభిలాష్‌ థపిల్యాల్‌, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్‌, సహెజ్మీన్‌ కౌర్‌లు కీలక పాత్రలు పోషించారు.