ఎవరైనా కుక్కను పెంచుకుంటారు.. లేదంటే పిల్లుల్ని పెంచుకుంటారు. కానీ, చిరుత పులుల్ని తీసుకొచ్చి ఒళ్లో కూర్చోపెట్టుకుంటారా? కార్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుతారా? మెడకు బెల్టేసి వాకింగ్కు తీసుకెళతారా? లేదు కదా! కానీ, గల్ఫ్ దేశాల్లోని సంపన్నుల ఇళ్లలో ఇవి తరచూ కనిపిస్తాయి. అరబ్ దేశాల్లోని చాలా మంది డబ్బున్నోళ్లకు చిరుతల్ని పెంచుకోవడం ఓ స్టేటస్ సింబల్. అందుకే ఆన్లైన్లో ఆర్డరిచ్చి మరీ చిరుతలను కొనేస్తున్నారు. అయితే, వారి సరదా చిరుత పులుల చావుకొచ్చిందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున అక్రమ దందా నడుస్తోందని, చివరికి చిరుత జాతే అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని చీతా కన్జర్వేషన్ ఫండ్(సీసీఎఫ్) అనే సంస్థ హెచ్చరించింది. ఆఫ్రికాలోని సోమాలీ లాండ్ అనే దేశం నుంచి సౌదీ అరేబియా వరకూ ఈ అక్రమ దందా ఎలా నడుస్తోందో ఆ సంస్థ ఇటీవల బయటపెట్టింది.
చిరుతను పెంచడం స్టేటస్ సింబల్
‘‘ఓ పెద్ద బంగళాలో ఒక చిరుత కూన నేషనల్ జియోగ్రాఫికల్ చానెల్లో షోను చూస్తూ ఒక్కసారిగా షాక్ కు గురైంది. పెద్ద టీవీ స్క్రీన్పై అడవిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్న పులి పిల్లలను చూసి అది ఒక్కసారిగా విచారంలోకి జారుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన దాని ఓనర్, రాక్షసానందం పొందాడు. కానీ ఆ చిరుత బాధను ఎవరు పట్టించుకుంటారు?’’ అంటూ సీసీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్దేశాల్లోని చాలా మంది బిలియనీర్లు చిరుతలను పెంచుకోవడాన్ని స్టేటస్సింబల్గా చూస్తున్నారని, వాటితో ఫొటోలు దిగుతూ సోషల్మీడియాలో పెట్టి గర్వంగా ఫీలవుతున్నారని తెలిపింది. ‘‘చిరుత కూనలు కావాలా? ఆడదైనా, మగదైనా ఫర్వాలేదు. రెండు, మూడు వారాల నుంచి రెండేండ్ల మధ్య ఏ వయసుది కావాలంటే ఆ వయసు చిరుతను మీకు అప్పగిస్తాం. రేటు జస్ట్ రూ.5 లక్షలే!’’.. ఇదీ ఓ వెబ్సైట్లో కనిపించిన ప్రకటన. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కూడా ఈ అక్రమ దందా సాగుతోందని సీసీఎఫ్ వెల్లడించింది. తాను ఇప్పటికే 80 చిరుతలను అమ్మేశానని, డబ్బులిస్తే 25 రోజుల్లో మరో చిరుతను తెప్పిస్తానని ఆ వెబ్సైట్ ఓనర్ చెప్పాడు. ఒక్కో చిరుత రేటు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పలుకుతోందట.
కార్డ్బోర్డ్బాక్సుల్లో కుక్కి..
సోమాలీలాండ్లోని ఓ అడవిలో కొన్ని వారాల కిందటే పుట్టిన మూడు చిరుతలను కార్డుబోర్డు బాక్సుల్లో కుక్కి దేశం దాటించే ప్రయత్నం చేశారు స్మగ్లర్లు. అయితే, అధికారులు పట్టుకుని ఆ చిరుతలను రెస్క్యూ సెంటర్కు తరలించారు. బాక్సుల్లో కుక్కడం వల్ల అనారోగ్యం పాలైన ఆ చిరుతలు ఇప్పుడు బతికే అవకాశం చాలా తక్కువగా ఉందట. స్మగ్లర్ల నుంచి కాపాడిన చిరుతల సంఖ్య ఇప్పటికే 32కు చేరిందట. అయితే, స్మగ్లర్లు నాలుగు చిరుతలను తరలిస్తే, గమ్యం చేరేసరికి వాటిలో ఒక్కోసారి మూడు చిరుతలు చనిపోతున్నాయని చెబుతున్నారు. ఒక్క ఆ దేశం నుంచే ఏటా 300 చిరుత పిల్లలను స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలించి అమ్మేస్తున్నారని సీసీఎఫ్ చెబుతోంది. ఆఫ్రికాలోని పలు దేశాల నుంచీ ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిపింది. మొత్తం15 దేశాల్లో ఈ వ్యాపారం జరుగుతుండగా, 90% కొనుగోళ్లు గల్ఫ్దేశాల నుంచే ఉంటున్నాయని పేర్కొంది. ఒక్క సౌదీ నుంచే 60% ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఇది ఆగకపోతే రెండేండ్లలో ఆ దేశాల్లో చిరుతలు అంతరించే ప్రమాదం ఉందని చెప్పింది.