హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఆర్బీఎం పెంపు, గ్యారంటీలు, ఇప్పటికే ఉన్న అప్పులు కలిపితే 2023–24 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 5,80,790 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, అప్పుడు ఏటా రూ.50 వేల కోట్లను అసలు, వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.లక్షా 10 వేల కోట్లు అని, ఇందులో రూ.50 వేల కోట్లు అప్పులు, వడ్డీలకు, రూ.40 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తే ప్రజలకు చేసేందుకు ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రైతుబంధు,ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్, రీయింబర్స్ మెంట్ కు డబ్బులు ఉండవని చెప్పారు. అసెంబ్లీలో ఎఫ్ఆర్బీఎం(సవరణ) బిల్లు పెట్టిన సందర్భంగా భట్టి ప్రసంగించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులను 5 శాతానికి పెంచుకునేలా సవరణ చేయడం వల్ల ఏడాదికి రూ.55,256 కోట్ల కొత్త అప్పులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాగా, భట్టి మాట్లాడే సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకుని.. భట్టి అంకెల గారడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలోనే ఇచ్చిన టైం అయిపోయిందని స్పీకర్.. భట్టి మైక్ను కట్ చేశారు. దీంతో భట్టితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్రెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయి నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం సవరణల చట్టాన్ని సీఎల్పీ వ్యతిరేకించినా.. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించుకుందని భట్టి మండిపడ్డారు.
ఒక్క రైతన్నా పాలభిషేకం చేసిండా: జీవన్రెడ్డి
కొత్త రెవెన్యూ చట్టానికి అధికార పార్టీ నేతలు తప్ప ఎవరూ పాలాభిషేకాలు చేయట్లేదని, వారిలో ఒక్క రైతైనా ఉన్నాడా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, ఫీల్డ్ సర్వే జరిగితేనే ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వం సంఖ్యా బలంతో బిల్లులు పాస్ చేసుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రెవెన్యూ బిల్లు తెచ్చారన్నారు. రాష్ట్రంలో భూసర్వే చేసేందుకు కేంద్రం రూ.200 కోట్లు కేటాయించిందని, అనేక రాష్ట్రాలు ఇప్పటికే చేయగా.. రాష్ట్రంలో ఆలస్యంగా చేపట్టారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని నెల జీతం బోనస్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్భూములకు ఆటోలాక్ ఎప్పటి నుంచో ఉందని, కొత్తగా ఆటోలాక్ చేసేది ఏందని ఆయన నిలదీశారు.