యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్ .. మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. మొదటి బ్యాచ్ MBBS క్లాస్ లు మొదలయ్యాయి. స్థానికుల నిరసనల కారణంగా ఏర్పాటుచేసిన గట్టి బందోబస్తు నడుమ బీబీనగర్ నిమ్స్ లో మెడికల్ కాలేజీని ప్రారంభించారు అధికారులు. భోపాల్ ఎయిమ్స్ నుంచే ఈ మెడికల్ కాలేజీ నిర్వహణ ఉంటుందని ఉన్నతాధికారులు చెప్పారు. భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ శర్మణ్ సింగ్ .. బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , జిల్లా నేతలు, అధికారులు హాజరయ్యారు.
తమ భూములను ప్రభుత్వం తీసుకుని.. సరైన నష్టపరిహారం ఇవ్వలేదని బీబీ నగర్, రంగాపురం గ్రామస్తులు ఎయిమ్స్ ముందు ఉదయం ధర్నా చేశారు. తమ కుటుంబాల్లో చదువుకున్న వారికి ఎయిమ్స్ లో ఉద్యోగాలు, పని కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులను అడ్డుకుంటామంటూ నిరసన ప్రదర్శన చేయడంతో.. కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో.. పోలీసు బందోబస్తు పెంచారు.
ఇప్పుడున్న బీబీనగర్ నిమ్స్ భవనంలో.. 50 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేశారు. నిర్వహణ బాధ్యతలను భోపాల్ ఎయిమ్స్ కు అప్పగించింది కేంద్రం. సిబ్బంది నియామకాలతోపాటు విద్యార్థుల సీట్లను భోపాల్ కేంద్రంగా ఆన్ లైన్ లో నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేశారు.