రామకృష్ణాపూర్, వెలుగు: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డుగు డుగు..’ అంటూ సాగిన పాటపై పెళ్లి బరాత్లో మూడు నిమిషాల పాటు నవ వధువు పయ్యావుల సాయిశ్రేయ చేసిన డ్యాన్స్కు యావత్ తెలంగాణ ఫిదా అయ్యింది. పాటకు అనుగుణంగా పెండ్లి కొడుకు ఎదుట ఆమె వేసిన స్టెప్పులు ఆహా అనిపించాయి. ఈ వధూవరులిద్దరూ మంచిర్యాల జిల్లాకు చెందినవారే. వరుడు రామకృష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్ మున్సిపాలిటీలో టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ కాగా, జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన వధువు సాయిశ్రేయ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వీరిద్దరికీ ఈ నెల 14న జన్నారం మండలం పొన్కల్లోని పైడిపెల్లి గార్డెన్స్లో మ్యారేజ్జరిగింది. పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో సాయిశ్రేయ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా కొత్త జంటకు లక్షల మంది తమ విషెస్ చెప్పడం విశేషం.