ఆన్లైన్ మార్కెట్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల పండుగసీజన్ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రిటైల్ మార్కెట్ వ్యాపారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య (CAIT) కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు చేసింది. విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రెండు సంస్థలు ఆఫర్ చేస్తున్న భారీ డిస్కౌంట్లు దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఆరోపించారు.
EMI ఆఫర్లు కూడా ఎక్కువ ప్రవేశపెట్టడంతో పాటు బ్యాంక్స్ కార్డులపై కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ అంటూ కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రకటనలు గుప్పిస్తున్నాయని ఆరోపించింది CAIT. దీనితో రిటైల్ వ్యాపారులకు పండగ సీజన్లలో భారీ నష్టాలు ఎదురవుతున్నాయని.. ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది . ఈ పండగ సేల్స్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. వాల్మార్ట్ అధీనంలోని ఫ్లిప్కార్ట్ ఆరు రోజుల అమ్మకాలు ఈనెల 29వ తేదీ ప్రారంభం కానున్నాయి. అమెజాన్ ఇంకా సేల్స్ తేదీలను ప్రకటించలేదు.