- ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్ చేసుకున్నారంటున్న సివిల్ సప్లయ్
- ధాన్యం దారి మళ్లింపుతో ఇటీవల మిల్లర్ అరెస్టు
- హోటల్సహా బ్లాక్ లో మిల్లర్ ప్రాపర్టీస్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో సీఎంఆర్ కేటాయింపు విషయంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు, కొందరు మిల్లర్లకు పంచాయితీ నడుస్తోంది. తనకు వడ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సివిల్సప్లై అధికారులు రాసుకున్నారని ఓ మిల్లర్ ఆరోపిస్తుండగా.. ఆ వడ్లను ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్ చేసుకున్నారని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెబుతోంది. కాగా మూడు రోజుల కింద మిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సీఎంఆర్ గోల్మాల్పై మిల్లర్ భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈక్రమంలోనే సదరు మిల్లర్లు సివిల్ సప్లై అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.
రూ.1.74 కోట్ల విలువైన వడ్ల గోల్మాల్
భువనగిరిలోని యాదాద్రి రైస్ మిల్లులో ఇటీవల ఎఫ్సీఐ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్ కోసం 6,668 టన్నులు వడ్లు కేటాయించగా.. కేవలం 160 టన్నులు వడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మిల్లును డిఫాల్టర్గా గుర్తించడంతో పాటు సీఎంఆర్ తీసుకోమని స్పష్టం చేశారు. దీంతో మిల్లు యజమాని నూనె వెంకటేశ్వర్లుపై సివిల్ సప్లయ్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఆయనను అరెస్ట్ చేశారు.
కాగా తనకు 2024–-25 వానాకాలం సీజన్లో రూ. 1.74 కోట్ల విలువైన 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సివిల్ సప్లైఆఫీసర్లు రాసుకున్నారని పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని పోలీసులకు రాతపూర్వకంగా అందచేసినట్లు తెలిసింది. కాగా వెంకటేశ్వర్లు చేస్తున్న ఆరోపణలను సివిల్ సప్లై ఆఫీసర్లు తోసిపుచ్చారు. యాదాద్రి మిల్లులో వెంకటేశ్వర్లుతోపాటు నలుగురు భాగస్వాములు ఉన్నారని, ఇందులో రామన్నపేట మండలంలోని ఓ మిల్లులో 6 వేల క్వింటాళ్ల వడ్లు అన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్రాక్ షీట్లు యాదాద్రి మిల్లు పేరుతోనే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
రూ.కోట్ల విలువైన ఆస్తులు బ్లాక్
యాదాద్రి మిల్లులో ఉండాల్సిన స్టాక్ 6,668 టన్నుల వడ్లు, 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిన టెండర్ బకాయి కలిపి రూ. 24 కోట్లు మిల్లర్చెల్లించాల్సి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మిల్లర్, అతడి భాగస్వాములకు సంబంధించిన ఆస్తులను బ్లాక్ చేయించారు. భువనగిరి మెయిన్ రోడ్పై ఉన్న హోటల్సహా బ్లాక్ చేసిన 14 ఆస్తులు సీజ్ చేశారు. ఈ హోటల్ విషయంలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
నాలుగు మిల్లుల స్టాక్లో తేడా
జిల్లాలోని మరో నాలుగైదు మిల్లుల్లోని స్టాక్లో తేడా ఉన్నట్టు సివిల్ సప్లయ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో రామన్నపేట మండలంలో భాగస్వాములు నిర్వహిస్తున్న రైస్ మిల్లుతో పాటు భువనగిరి, ఆలేరు మండలాల్లోని రైస్ మిల్లుల్లో భారీగా స్టాక్ తేడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మిల్లులకు గత సీజన్లలో ఇచ్చిన స్టాక్, అప్పగించిన సీఎంఆర్ వివరాలను విజిలెన్స్కు జిల్లా ఆఫీసర్లు అందించారు. టెండర్వడ్లకు సంబంధించిన రూ. 32 కోట్ల బకాయిల్లో రెండు మిల్లులు మాత్రమే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉందని మిల్లర్లే చెబుతున్నారు. కాగా ఆ మిల్లులను త్వరలో విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీ చేయనున్నట్టు తెలిసింది.
మిల్లుల్లో రూ.1300 కోట్ల వడ్లు
జిల్లాలోని మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు పేరుకుపోయాయి. 2023 యాసంగి సీజన్కు చెందిన వడ్లకు సంబంధించి రూ. 43 కోట్లు చెల్లించాలని మిల్లర్లను ప్రభుత్వం ఆదేశించింది. 2025 యాసంగికి చెందిన 47, 136 టన్నుల వడ్లు, 2025 వానాకాలం వడ్లు 1,86,344 టన్నులు, 2026 యాసంగిలో 3.10 లక్షల టన్నుల వడ్లను అప్పగించారు. ఈ మూడు సీజన్లకు సంబంధించిన వడ్లు, 2023 యాసంగి సీజన్కు సంబంధించిన రూ.32 కోట్లు కలిపి మిల్లర్ల వద్ద సుమారు రూ. 1300 కోట్లు విలువైన వడ్లు ఉన్నాయి. అయితే ఈ మిల్లుల్లో ఈ స్థాయిలో వడ్లు ఉన్నాయా..? దారి మళ్లించారా..? అన్న అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
