- మనీకంట్రోల్ నివేదికలో వెల్లడి
- కంపెనీ కార్యాలయ స్థలాలు సైతం తగ్గింపు
- ఖర్చు తగ్గింపులో భాగంగానే అన్న సీఈవో
ఏడాది కాలంగా టెక్ ఉద్యోగుల్లో చాలా మంది భయంతో పని చేస్తున్నారు. కారణం.. ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో అనే ఆందోళన. వారి భయాలను నిజం చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా మందికి పింక్ స్లిప్లు ఇచ్చేస్తున్నాయి. అందులో చోటా కంపెనీలతో పాటు బడా కంపెనీలూ ఉండటం టెక్కీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు కాగ్నిజెంట్ అదే బాటలో నడుస్తోంది.
ఖర్చు తగ్గించుకుంటున్నాం...
కాగ్నిజెంట్లో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో రవికుమార్ తెలిపారు. ఖర్చు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా కంపెనీ 11 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కూడా వదులుకోనుంది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పడతాయని కాగ్నిజెంట్ చెప్పిందని మనీ కంట్రోల్ నివేదిక వెల్లడించింది. గతంలో ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ గా పని చేసిన రవికుమార్ ఈ ఏడాది జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉన్నా.. దాని ప్రధాన కార్యకలాపాలు భారత్ నుంచే జరుగుతాయి.
టెక్ ఇండస్ట్రీలో తొలగింపుల పరంపర..
ఇటీవలే విప్రో, అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎం, గూగుల్, మెటా, ట్విటర్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్ పరిశ్రమలో ఇంకెంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.