
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు జిల్లాలకు మినహా 31 జిల్లాలకు కరోనా సెగ తగిలింది. వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలో స్థానిక వ్యక్తులెవరికీ కరోనా సోకకున్నా.. ముంబై నుంచి ఆ జిల్లాకు వచ్చిన వలస కూలీలకు కరోనా ఉన్నట్లు తేలడంతో ఆ జిల్లా కూడా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో చేరింది. అయితే పాజిటివ్ కేసులు నమోదైన 31 జిల్లాల్లో ప్రస్తుతం 12 జిల్లాలకు చెందిన పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ జిల్లాల్లో పెద్దపల్లి (2 కేసులు), భద్రాద్రి కొత్తగూడెం(4), కరీంనగర్(19), మహబూబాబాద్(1), మెదక్(6), ములుగు(2), నాగర్ కర్నూల్(2), నల్లొండ(15), నారాయణపేట(1, డెత్), సిరిసిల్ల(3), సంగారెడ్డి(7), సిద్దిపేట(1) ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలన్నీ కరోనా పాజిటివ్ కేసుల్లేని జిల్లాలుగా మారిపోయాయి.
19 జిల్లాలు.. 444 మంది పేషెంట్లు
ప్రస్తుతం 19 జిల్లాలకు చెందిన 444 పేషెంట్లు మాత్రమే కరోనాకు ట్రీట్మెంట్తీసుకుంటున్నారు. కరోనా విజృంభించిన తొలిరోజుల్లో కరీంనగర్లో నమోదైన 19 కేసుల్లో 18 మంది విడతలవారీగా డిశ్చార్చ్ అయ్యారు. చివరి పేషెంట్ సోమవారం డిశ్చార్జీ కావడంతో కరీంనగర్ జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య జీరో అయింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నాటికి 761 పాజిటివ్ కేసులు నమోదు కాగా 379 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కరోనాకు ట్రీట్మెంట్తీసుకుంటున్న 444 మందిలో 382 మంది జీహెచ్ఎంసీ పరిధి వారే. మిగిలిన 62 మంది 18 జిల్లాలకు చెందినవారు.