తిరుపతిలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం కేసులు 5,939 నమోదు కాగా ఒక్క తిరుపతిలో 3వేల మందికి కరోనా సోకింది. ప్రతీరోజు 300 పైగా కేసులు నమోదు కావడంతో..అనుమానిత లక్షణాలతో ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఈ క్రమంలో తిరుపతి మెటర్నిటి ఆసుపత్రి టెస్టింగ్ సెంటర్ కు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నాయంటూ తమకు టెస్ట్ లు చేయాలని క్యూలైన్ లో ఎగబడ్డారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.
మరోవైపు తిరుపతి రుయూ ఆస్పత్రిలో టెస్ట్ సెంటర్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కానీ రుయూ ఆస్పత్రికి కరోనా టెస్టింగ్ సెంటర్ కు వచ్చిన ప్రజలు వాటిని విస్మరించి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్ లో కరోనా టెస్ట్ లు చేయించుకునేందుకు వచ్చిన ప్రజలు మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో అధికారులు ఆందోళనకు గురువుతున్నారు. కరోనా విషయంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కరోనా సోకుతుందని చెబుతున్నారు. ప్రైమరి, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టెస్టుల కోసం రావాలని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు.