- సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని సూచించిన హెల్త్ మినిస్టర్
కోజికోడ్: కేరళలో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ హెల్త్ మినిస్టర్ కె.కె. శైలజ సూచించారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అందరికీ కరోనా టెస్టులు చేస్తామని అన్నారు. దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. “ విమాన రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అందరికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించాం. ప్రతి ఒక్కరు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోండి” అని మినిస్టర్ అన్నారు. విధుల్లో పాల్గొన్న వారు టోల్ఫ్ ఫ్రీ లేదా కంట్రోల్ రూమ్ నంబర్స్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 18 మంది చనిపోయారు. కాగా.. చనిపోయిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం
కొజికోడ్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తున్నట్లు ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్సింగ్ పూరి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇస్తామని అన్నారు. అధికారులతో కలిసి హర్దీప్ సింగ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.