హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇప్పిస్తానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… V1 అనే ఛానెల్ ఎండీ ప్రశాంత్.. డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇప్పిస్తానని ఒక్కోక్కరి వద్ద నుండి లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశాడు. అలా మొత్తం 40 మందిని మోసం చేసి 70 లక్షల మేర కాజేశాడు. మీడియాలో పనిచేస్తున్నానని.. తనకు పెద్ద, పెద్ద వాళ్ళు తెలుసని చెప్పి మోసం చేశాడని తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ అలార్ట్ మెంట్ లెటర్స్ తయారు చేసి వారికిచ్చాడని తెలిపారు. గతంలో SI అని చెప్పి మోసం చేసి, పోలీసులకు పట్టుబడ్డాడని సీపీ తెలిపారు.
నిందితుడి వద్ద నుండి 8 లక్షల రూపాయలతో పాటు ఒక xuv కారు, నకిలీ అలార్ట్ మెంట్ లెటర్స్, లాప్ టాప్, ప్రింటర్, ఫేక్ ఎస్సై ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ SOT, KPHB పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించారు.