పోలీసులకు ఫిర్యాదు చేసిన బడంగ్ పేట మున్సిపల్ కమిషనర్
ఎల్ బీనగర్, వెలుగు: దివ్యాంగుల భవనం కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసిన ఘటన బడంగ్పేట కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లో జరిగింది. దీంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్ గుల్ లోని సర్వే నం.78,79లో ఉన్న ఓ వెంచర్ లోని పార్క్ స్థలంలో దివ్యాంగుల కోసం భవనం నిర్మించేందులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత నెల14న శంకుస్థాపన చేశారు. కాగా ఆ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం కూల్చివేశారు.
దీంతో బడంగ్పేట కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మీర్ పేట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా కూల్చివేసిన ఓ జేసీబీని గుర్తించారు. అయితే, ఇదే విషయంపై కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఆరునెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని మంత్రి సబితా శంకుస్థాపన సమయంలో పేర్కొన్నారు. కానీ ఇది ప్రైవేటు వెంచర్లో ఉన్న పార్క్ స్థలం అవ్వడంతో అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్థలంలో దివ్యాంగుల భవనం నిర్మించి ఉంటే ఈ సమస్య ఇక్కడ వచ్చి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.