చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఉపయోగించవద్దంటూ ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) పలు రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. కరోనా నిర్ధారణ విషయంలో ఫెయిలవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
చైనా కు చెందిన గ్వాంగ్జౌ వోన్డ్ఫో బయోటెక్, జుహాయి లివ్జాన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల ఉత్పత్తులను ఉపయోగించవద్దని తెలిపింది. ఈ కిట్లు కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వస్తాయని కంపెనీ భరోసా ఇచ్చింది, కానీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపించిందని ఐసీఎంఆర్ తెలిపింది. కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఈ కిట్లను దిగుమతి చేసుకున్నాయని, వెంటనే వీటి వాడకాన్ని నిలిపివేసి, చైనాకు తిప్పి పంపించాలని ఆదేశించింది
ఆర్టీ-పీసీఆర్ విధానం ద్వారా నిర్వహించే పరీక్షలే కరోనా నిర్ధారణకు ప్రామాణికమని, ఈ విధానం ద్వారానే కరోనాను తొలి దశలోనే గుర్తించడం సాధ్యమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ఆర్టీ-పీసీఆర్ విధానమే అత్యుత్తమ మార్గమని పేర్కొంది.