- దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
- బలపడుతున్న రూపాయి విలువ
- యూఎస్లో కొద్దిపాటి రెసిషన్ ఉంటే మనకు ప్లస్ అంటున్న ఎనలిస్టులు
బిజినెస్ డెస్క్, వెలుగు: ‘అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది’..ఈ సామెత వినే ఉంటారు. కానీ, ప్రస్తుతం యూఎస్ ఆర్థిక వ్యవస్థ టెక్నికల్గా రెసిషన్ (మాంద్యం) లోకి జారుకున్నప్పటికీ, మన స్టాక్ మార్కెట్లు వరసగా మూడో సెషన్లోనూ ర్యాలీ చేశాయి. మరి ఈ లాభాలు తాత్కాలికమేనా? బహుశా కాకపోవచ్చు. యూఎస్ జీడీపీ వరసగా రెండో క్వార్టర్లో తగ్గినా, మన మార్కెట్లు పాజిటివ్గా కదులుతుండడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. జీడీపీ నెంబర్లను మరీ ఎక్కువగా పట్టించుకోవద్దని ఎనలిస్టులు అంటున్నారు. యూఎస్ ఎకానమీ స్లోడౌన్ అయితే డాలర్ విలువ తగ్గుతుందని, వడ్డీ రేట్లను పెంచడం స్లో అవుతుందని చెబుతున్నారు. ఫలితంగా దేశం నుంచి వెళ్లిపోయే విదేశీ ఇన్వెస్ట్మెంట్లు తాత్కాలికంగానైనా ఆగుతాయని, రూపాయి విలువ బలపడుతుందని అన్నారు. దీనికి తోడు మన దేశంలో ఎకానమీ నిలకడగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మరీ అధ్వాన్నంగా మారితే మాత్రం అన్ని దేశాల ఎకానమీలు నష్టపోతాయని అంటున్నారు. ‘యూఎస్ జీడీపీ తగ్గడం = రెసిషన్ = తక్కువ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు= షేర్లలో కొనుగోలు పెరగడం. ఈ లాజిక్ భవిష్యత్లో ఎప్పుడోకప్పుడు పనిచేయకపోవచ్చు. కానీ, అది ఇప్పుడు కాదు’ అని ఓండా సీనియర్ ఎనలిస్ట్ (ఆసియా పసిఫిక్) జెఫరీ హేలి అన్నారు. యూఎస్ జీడీపీ జూన్ క్వార్టర్లో 0.9 శాతం తగ్గగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 1.6 శాతం పడింది. ‘వరసగా రెండో క్వార్టర్లోనూ యూఎస్ జీడీపీ తగ్గడం టెక్నికల్ రెసిషన్కు ప్రారంభం లాంటిది. నిజమైన రెసిషన్ మొత్తం లేబర్ మార్కెట్పైన, పరిశ్రమల ఉత్పాదకతపైన, ఎకానమీ ఇండికేటర్లపైన ఆధారపడి ఉంటుంది’ అని నోమురా ఇండియా పేర్కొంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ స్లో అయ్యిందనేది నిజమని చెప్పారు.
ఇండియాపై ప్రభావం..
యూఎస్ జీడీపీ తగ్గడంతో డాలర్ ఇండెక్స్ 0.46 శాతం తగ్గి 105.86 కి పడింది. ఫలితంగా దేశ రూపాయి విలువ డాలర్ మారకంలో శుక్రవారం 45 పైసలు పైగా బలపడి 79.24 కి చేరుకుంది. సాధారణంగా డాలర్ విలువ తగ్గితే స్టాక్ మార్కెట్లు పెరుగుతుంటాయి. డాలర్ విలువ తగ్గినా, వడ్డీ రేట్లు నెమ్మదించినా షార్ట్ టెర్మ్లోనైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా లాభపడతాయని టీడీ సెక్యూరిటీస్ మితుల్ కొటెచా అన్నారు. ‘యూఎస్, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొద్దిపాటి రెసిష న్లోకి జారుకునే అవకాశం ఉంది. అంతమాత్రాన అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా బాధపడాలని లేదు. చైనా ఎకానమీ గ్రోత్ కూడా పెద్దగా పెరగలేదు. చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. ఇండియా వంటి చాలా దేశాల్లో వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతుంది. గ్రోత్ పెద్దగా ఉండకపోవచ్చు. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ రిలీఫ్ తాత్కాలికంగానే ఉంటుందని అంచనావేస్తున్నాం’ అని కొటెచా పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల నుంచి ఎఫ్ఐఐల నుంచి ఎదుర్కొన్న అమ్మకాల ఒత్తిడి ప్రస్తుతం కనిపించడం లేదని నాపియన్ క్యాపిటల్ గౌతమ్ త్రివేది అన్నారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్న స్థితికి వెళితే తప్ప దేశ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవని చెప్పారు.
మరో సెషన్లోనూ పైకే..
సెన్సెక్స్, నిఫ్టీలు వరసగా మూడో సెషన్ లోనూ దూసుకుపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పెరగడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు శుక్రవారం 1 శాతానికి పైగా లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా కదలడంతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ పెరగడంతో దేశ స్టాక్ మార్కెట్లకు సపోర్ట్ లభించింది. సెన్సెక్స్ శుక్రవారం 712 పాయింట్లు (1.25 శాతం) పెరిగి 57,570 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 229 పాయింట్లు ఎగిసి 17,158 వద్ద ముగిసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 45 పైసలు బలపడింది. ‘విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి తగ్గడం స్టాక్ మార్కెట్లకు పెద్ద ప్లస్గా మారింది. అంతేకాకుండా ఎఫ్ఐఐలు ఈ నెలలో ఎనిమిది సెషన్లలో నికర కొనుగోలుదారులుగా కూడా మారారు. అందుకే ఫైనాన్షియల్ షేర్లు పెరగడం చూశాం. ఈ సెక్టార్ మెరుగు పడినట్టు క్యూ1 రిజల్ట్స్ బట్టి తెలుస్తోంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.