ఏసీబీ చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో 1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు మేడ్చల్ జిల్లా కీసర మండలం ఎమ్మార్వో. ఓ వివాదాస్పద భూమికి కొందరికి అనుకూలంగా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు ఈ లంచం తీసుకున్నాడు. అతని వద్ద లభించిన మరో రూ.25 లక్షలు అవినీతి సొమ్మును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తులు కూడా.. రూ.100 కోట్లు పైనే ఉన్నట్టు సమాచారం.
ఆ ఎమ్మార్వో బాధితుడైన ఓ మాజీ విజులెన్స్ అధికారి, ఎస్ పి సురేందర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాంపల్లి దాయర లోని సర్వే నెంబర్ 614 లో తన పొలం 5.5 గుంటలని.. తాను 2018 లో దుర్గా రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. దౌర్జన్యం గా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తన భూమి హద్దులను ఎమ్.ఆర్.ఓ డిమోలిష్ చేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు.. ఎమ్ఆర్వో తన సొంత నిధులతో కాంపౌండ్ నిర్మించాడని చెప్పారు. స్థానికంగా ఉన్న కొంత మంది రియల్టర్ల తో కలిసి పలుమార్లు ఇబ్బందులకు గురిచేశాడని.. చివరకు తన భూమికి సంబంధించి కొత్త పాస్ బుక్ లు వచ్చినా..తన చేతికి ఇవ్వకుండా పాస్ బుక్ రద్దు కు ఆదేశించాడని చెప్పారు.
ఎమ్ ఆర్ ఓ నాగరాజు పై పలుమార్లు జిల్లా కలెక్టర్ కు , జాయింట్ కలెక్టర్ కు , ఆర్ డి ఓ ఇలా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించలేదని మాజీ ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. కోట్ల విలువ చేసే విలువైన భూమిని రియల్టర్లు రైతులను మభ్యపెడుతూ.. అందిన కాడికి దోచుకుంటున్నారని అన్నారు. అవినీతి ఎమ్ ఆర్ ఓ నాగరాజు , అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.