
- ఇప్పటి వరకు ఇదే అత్యధికం
న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్లో వస్తు సేవల పన్ను వసూళ్లు 12.4 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో తొలిసారిగా రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్లు బాగుండటమే ఇందుకు కారణమని తెలిపింది. దిగుమతులు 8.3 శాతం పెరిగాయని పేర్కొంది. ప్రాథమికంగా విక్రయించిన వస్తువులు, అందించిన సేవలపై పన్ను వసూలు ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ సమకూరుతుంది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.78 లక్షల కోట్లకు పైగా ఉండగా, ఏప్రిల్ 2023లో రూ. 1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి.
ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపు, సమర్థవంతమైన పన్ను వసూళ్ల కారణంగా జీఎస్టీ వసూళ్లు రూ. 2 లక్షల కోట్ల బెంచ్మార్క్ను అధిగమించాయని ఆమె చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగుండటం, వ్యాపారాల స్వయం సమ్మతి, సమయానుకూల ఆడిట్ పరిశీలన, డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యల వల్ల ఈ రికార్డు సాధ్యపడిందని పన్ను నిపుణులు తెలిపారు. పెరిగిన వసూళ్లు జీఎస్టీ సంస్కరణలకు మరింత ఊపును ఇస్తాయని అభిప్రాయపడ్డారు.
సీజీఎస్టీ రూ. 43,846 కోట్లు
ఈ ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ జీఎస్టీ (సిజీఎస్టీ) విలువ రూ. 43,846 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వసూళ్లు రూ. 53,538 కోట్లకు చేరాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ. 99,623 కోట్లు ఉంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై లెవీల ద్వారా రూ. 37,826 కోట్లు వసూలు అయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.1,008 కోట్లతో కలిపి మొత్తం సెస్ వసూలు విలువ రూ.13,260 కోట్లకు చేరింది. ఐజీఎస్టీ వసూళ్లలో రూ. 50,307 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ. 41,600 కోట్లు ఎస్ జీఎస్టీకి చెల్లించారు. సాధారణ సెటిల్మెంట్ తర్వాత ఏప్రిల్ 2024లో సీజీఎస్టీకి రూ. 94,153 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 95,138 కోట్లు కేటాయించారు.
రాష్ట్రాలకు ఐజీఎస్టీ సెటిల్మెంట్ కారణంగా బకాయిలు పెండింగ్లో లేవని సీతారామన్ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. రీఫండ్లను లెక్కించిన తర్వాత, ఏప్రిల్ 2024లో నికరంగా జీఎస్టీ ఆదాయం రూ. 1.92 లక్షల కోట్లుగా ఉంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15.5 శాతం ఎక్కువ.