పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగొచ్చనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాల స్పందన

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగొచ్చనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాల స్పందన

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎట్టకేలకు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భారత్లో అవసరమైనంత, డిమాండ్కు తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని.. అందువల్ల మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ముడి చమురు ధరలు బారెల్కు 130 డాలర్లు దాటకపోతే, పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని వివరణ ఇచ్చాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు $100 డాలర్లకు మించదని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మన దేశంలో ఏ పెట్రోల్ బంక్లో కూడా ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ కొరత లేదని వెల్లడించాయి. ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ (ATF) కూడా సరిపడినంత ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 28, 2026 నుంచి మొదలైన యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. అమెరికా ముడి చమురు ధరలు ఒకే వారంలో 35.63 శాతం పెరగడం ఇదే మొదటిసారి. WTI ముడి చమురు ధరలు ఒకే ట్రేడింగ్ సెషన్‌లో $119.48కి పెరిగి, మార్చి 09న $103.32 దగ్గర నిలిచాయి. బ్రెంట్ చమురు ధర కూడా దాదాపు 100 డాలర్లు దాటింది.

►ALSO READ | లెబనాన్‌పై ఇజ్రాయెల్ కెమికల్ దాడి: నిప్పుల వర్షం కురిపిస్తూ ఇళ్లను తగలబెడుతున్న సైన్యం

2020 ఏప్రిల్ తర్వాత ఒకే వారంలో ఇంతటి పెరుగుదల ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల అవి ధరలను పెంచే అవకాశాలు ఉంటాయి.