- నేడు నల్లబెల్లికి కేసీఆర్.. పెద్ది ఫ్యామిలీకి పరామర్శ
వరంగల్ / నర్సంపేట / నల్లబెల్లి, వెలుగు : గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. శనివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలు, ఉమ్మడి వరంగల్ జిల్లా లీడర్లతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయం ప్రకటించారు. పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పిల్లల చదువు, భవిష్యత్తుతో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
నేడు నల్లబెల్లికి కేసీఆర్.. రేపు సంతాప సభ
పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రానికి రానున్నారు. పెద్ది ఫొటోకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సోమవారం సుదర్శన్రెడ్డి సంతాప సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 30 వేల మందికి భోజన సౌకర్యం, వసతులు ఏర్పాటు చేశారు. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు. సంతాప సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సతీశ్రెడ్డి, మర్రి యాదవరెడ్డి పరిశీలించారు.
