శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి. సోమవారం ( మార్చి 9 ) ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయం దగ్గరికి చేరుకున్న పీఠాధిపతికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం దగ్గర పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితలు, అధికారులు.
అనంతరం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను నిర్వహించారు మహాస్వామి. తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో మహాస్వామికి గౌరవార్థం వేదగోష్ఠి, గురువందన కార్యక్రమం నిర్వహించారు.
►ALSO READ | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత లేదు... అసత్య ప్రచారాలు నమ్మొద్దు : టీటీడీ క్లారిటీ
అనంతరం మహాస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు సనాతన ధర్మం యొక్క విశిష్టత, శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, శివానందలహరి – సౌందర్యలహరి స్తోత్రాల విశేషాలను వివరించారు. చివరగా మహాస్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనాలను అందజేశారు.
