కన్న కూతురిపై ఏడాదిగా  అఘాయిత్యం.. వికారాబాద్ లో తండ్రిపై పోక్సో కేసు నమోదు

 కన్న కూతురిపై ఏడాదిగా  అఘాయిత్యం.. వికారాబాద్ లో తండ్రిపై పోక్సో కేసు నమోదు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే... కీచకుడిగా మారి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.

వికారాబాద్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఓ నికృష్టుడు... తన 14 ఏళ్ల కన్న కూతురిపై గత ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జులై  27వ తేదీన బాధితురాలికి తీవ్ర కడుపునొప్పి రావడంతో, భయంతో వణికిపోయిన ఆ బాలిక పాఠశాల ఉపాధ్యాయురాలికి అసలు విషయం చెప్పింది. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయురాలు ఈ దారుణంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులకు సమాచారం అందించారు.

►ALSO READ | బాధితురాలికంటే ముందే మరో ఇద్దరికి ప్రపోజ్: ట్రైనీ ఐపీఎస్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు

సీడబ్ల్యూసీ అధికారుల విచారణలో ఆ బాలిక ఎదుర్కొన్న నరకం బయటపడటంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... వికారాబాద్ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కన్నకూతురి పట్ల మృగంలా ప్రవర్తించిన ఆ తండ్రికి తగిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.