యాదాద్రి కలెక్టరేట్ గేటుకు తాళం.. స్టాఫ్ టైంకు రాలేదని గేటు క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్

యాదాద్రి కలెక్టరేట్ గేటుకు తాళం..  స్టాఫ్ టైంకు రాలేదని గేటు క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్
  •     10.45 అయినా స్టాఫ్ రాకపోవడంతో గేటును క్లోజ్ చేయించిన ఇన్ చార్జి కలెక్టర్
  •      అరగంట ఆలస్యంగా రావచ్చంటూ ఓ ఉద్యోగి నిరసన, షోకాజ్ నోటీసు జారీ
  •     'మీ ప్రమాణం' యాప్ ప్రకారమే జీతాలు ఇన్ చార్జి కలెక్టర్ ఆదేశాలు


యాదాద్రి, వెలుగు : టైంకు డ్యూటీకి రాని ఉద్యోగులపై యాదాద్రి ఇన్ చార్జి కలెక్టర్​ భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10.45 గంటలైనా ఉద్యోగులు రాకపోవడంతో కలెక్టరేట్ గేటుకు తాళం వేయించారు. యాదాద్రి కలెక్టరేట్​లో ఆగస్టు నుంచి 'మీ ప్రమాణం' యాప్​ ద్వారా అటెండెన్స్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వెయ్యి మంది ఉద్యోగుల్లో 250 మందికిపైగా యాప్ ను డౌన్ లోడ్​చేసుకోలేదు. డౌన్ లోడ్ చేసుకున్న వారిలో కూడా కొందరు యాప్​లో అటెండెన్స్​ వేయకుండా ఇష్టమొచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. దీనిని గుర్తించిన ఇన్ చార్జి కలెక్టర్ భాస్కరరావు శుక్రవారం ఉదయం 10 గంటలకే  కలెక్టరేట్​కు వచ్చారు. 10.30 అయినా చాలా మంది ఉద్యోగులు తమ డిపార్ట్​మెంట్లకు రాలేదు. మరో 15 నిమిషాలు వేచి చూసిన అనంతరం కలెక్టరేట్ గేటుకు, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వైపు ఉన్న గేటుకు తాళం వేయించారు. దీంతో ఆ తర్వాత వచ్చిన ఉద్యోగులంతా గేటు బయటే వేచి ఉన్నారు. కొంత సేపటి తర్వాత గేటు తాళం తీయడంతో ఉద్యోగులు తమ డిపార్ట్ మెంట్లలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా... 'మీ ప్రమాణం' యాప్​ ద్వారా అటెండెన్స్​వేసిన వారికే జీతాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ ట్రెజరరీకి ఇన్​చార్జ్​ కలెక్టర్​భాస్కర్​రావు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్​జీతం నుంచే ఇది అమలు చేయాలని, అటెండెన్స్ వేయని వారికి జీతం ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఉద్యోగి నిరసన, షోకాజ్ నోటీసు జారీ

కలెక్టరేట్ గేట్లకు తాళం వేయడంతో ఆర్అండ్ బి డిపార్ట్ మెంట్ ఉద్యోగి అశోక్​గేటు బయటే బైఠాయించి, నిరసనకు దిగారు. 'కొద్దిసేపు ఆలస్యమైతేనే తాళం వేస్తారా ? ఉద్యోగులతో పాటు విజిటర్స్​కూడా ఇబ్బంది కలుగుతోంది, డ్యూటీ సమయానికి అరగంట వెసులుబాటు ఉంది' అని కామెంట్ చేశారు. నిరసన వ్యక్తం చేయడంతో పాటు రూల్స్​కు విరుద్ధంగా మాట్లాడారంటూ అశోక్​కు షోకాజ్​నోటీసులు జారీ చేశారు. అరగంట ఆలస్యంగా రావచ్చన్న రూల్​ఎక్కడ ఉందో చూపుతూ ఆన్సర్ ఇవ్వాలని నోటీసుల్లో 
పేర్కొన్నారు.