తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ(జులై 30) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అత్యంత భారీ వర్షాల ముప్పు పొంచి ఉండటంతో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ (కొమరంభీమ్), నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
►ALSO READ | నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు: కడెం ప్రాజెక్టు ఉధృతి.. 16 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఇంజనీరింగ్, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. హైదరాబాద్ తో పాటు మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
