హైదరాబాద్, వెలుగు : ఫ్రీ వాటర్ ట్యాంకర్లను దారి మళ్లించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వాటర్ బోర్డు దొంగలు బుక్కయ్యారు. బోర్డు సిబ్బంది, ట్యాంకర్ డ్రైవర్లు, ఓ పార్టీకీ చెందిన నేత కలిసి చేస్తున్న ఈ దందాపై కేసు నమోదైంది. వాటర్ బోర్డు ఎండీ దృష్టికి వెళ్లగా విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. కొంతకాలంగా15 వేల ట్యాంకర్ల వాటర్ పక్కదారి పట్టినట్టుగా తేల్చారు. డెయిలీ 500–600 ట్యాంకర్లను తరలిస్తూ ఒక్కో ట్యాంకర్ ను రూ. 850కు అమ్ముకున్నట్టు విచారణలో వెల్లడైంది. కాటేదాన్ ఇండస్ట్రీయల్ ఏరియాల్లో ఫ్రీ వాటర్ దందా జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
విజిలెన్స్ ఫోకస్తో వెనక్కి..
ఎండీ దానకిషోర్ కు సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించారు. వాటర్దందాపై దృష్టి పెట్టి ఎంక్వైరీ చేశారు. ఇందులో భాగంగా బహదూర్ పురా ఓఅండ్ఎం డివిజన్ లోని ఫిల్లింగ్ స్టేషన్ వద్ద నిఘా పెట్టారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ట్యాంకర్ల ఓనర్లు రోజువారీ ట్యాంకర్ల సంఖ్యను ఒక్కసారిగా తగ్గించారు. ప్రతి నెలా 600 ట్యాంకర్లను సరఫరా చేసినట్లు విచారణలో తేలగా, విజిలెన్స్ నిఘాపై తెలిసిన తర్వాత ఏకంగా 30 లోపు ట్యాంకర్లను మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది.
నల్లా కేటగిరీ మార్పుకు చెక్ పడేదెన్నడు ?
గతంలోనూ ఓల్డ్ సిటీలోని బోర్డు సిబ్బంది దందాను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నల్లా కేటగిరీ మార్చుతూ సంస్థ ఆదాయానికి గండికొట్టారు. తాజాగా ఫ్రీ వాటర్ ట్యాంకర్లను అడ్డదారిలో మళ్లించి సొమ్ము చేసుకున్న వ్యవహారంపై ఉన్నతాధికారులే ఆశ్చర్య పోతున్నారు. ఈ దందాతో ప్రతి నెలా రూ. 50లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నారు. నీటి దొంగలపై కాలాపత్తర్ పీఎస్ లో కాంప్లయింట్చేయగా 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో సంస్థకు వాటిల్లిన నష్టంపై క్లారిటీ రాలేదని వాటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.