
- పంపిణీకి రాష్ట్ర సర్కారు సన్నాహాలు
- ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం!
- రాబోయే ఖరీఫ్లో రైతులు సన్నాలు సాగుచేసి మరింత లాభపడేలా ఆలోచన
- రేషన్ బియ్యం రీసైక్లింగ్కూ చెక్
హైదరాబాద్, వెలుగు : పేదోళ్లకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేషన్దుకాణాల్లో రాష్ట్ర రైతులు పండించిన సన్నబియ్యం అందించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో సన్నాలు, దొడ్డు రకం వరి ఏ మేరకు సాగవుతోంది ? ఇప్పుడు రాష్ట్రంలో సన్నబియ్యం వినియోగం ఎంత ? అనే వివరాలు సిద్ధం చేయాలని చెప్పినట్టు తెలిసింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా అటు రైతులకు మంచి ధర అందివ్వడమే కాకుండా.. ఇటు రేషన్కార్డు వినియోగదారులకు మేలు చేసినట్టు అవుతుందని సర్కారు భావిస్తోంది.
ఫలితంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ రవాణాకు అడ్డు పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్షాపుల్లో ప్రతిఏటా దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త రేషన్కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. ఈ కోటా మరికొంత పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో రానున్న ఖరీఫ్లో రాష్ట్ర రైతులతో పెద్ద ఎత్తున సన్నాలు సాగు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఖరీఫ్లో సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి.. రేషన్ షాపుల్లో ఈ ఏడాదిలో ఎప్పుడు సన్న బియ్యం పంపిణీ మొదలుపెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు .
రైతులకు మేలు చేసేలా.. పేదల కడుపు నిండేలా
రైతుల పంట ఉత్పత్తులు రేషన్ షాపుల ద్వారా విక్రయాలు జరిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పేరొన్నారు. రాష్ట్రంలో వరి సాగును గమనిస్తే గత రెండేండ్లు ఖరీఫ్లో 60 లక్షల ఎకరాలు దాటింది. అంటే మొత్తం సాగవుతున్న పంటల్లో 50 శాతం వరే కావడం గమనార్హం. అయితే ఇందులో సన్నాలు ఎంత సాగవుతున్నాయి ? దొడ్డు రకం ఎంత సాగవుతుంది? అనే లెక్క స్పష్టంగా లేదు. దీంతో ఈసారి సన్నాల సాగుపై లెక్క తీయాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాల సాగును పెంచేలా చర్యలు కూడా తీసుకోనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం యావరేజ్గా 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు పండిస్తే.. ఏడాది మొత్తం రేషన్ షాపుల నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు వీలుంటుంది. నేరుగా రైతుల నుంచి సన్నవడ్లను సేకరించి.. మిల్లింగ్ చేసి సివిల్ సప్లయ్స్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఇస్తే గిట్టుబాటు ధర కంటే ఎక్కువ వస్తుంది. కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి సంబంధం లేకుండా అధిక ధరను కూడా రైతులకు ఇచ్చే వీలుంటుందని ప్రభుత్వం యోచిస్తున్నది. అదే సమయంలో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి వెచ్చిస్తున్న దానికంటే తక్కువ ధరకే పేదలకు అందించనట్లువుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏమైనా ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
రేషన్ బియ్యం తినేది కొంతమందే
రాష్ట్రంలో దాదాపు 94 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో మూడు కోట్లకు పైగా మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెలా ప్రభుత్వం యావరేజ్గా 2 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నది. అయితే ఈ బియ్యంలో రేషన్ కార్డుదారులు ప్రతినెలా 20 శాతం మేర తీసుకోవడం లేదని తెలిసింది. ఇక రేషన్ బియ్యం తీసుకున్నవారిలోనూ 50 శాతంలోపు మందే వీటిని తినడానికి వినియోగించుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. మిగిలినవారు తాము కొన్న రేషన్బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో కిలోకు రూ.10, రూ.15 చొప్పున అమ్ముకుంటున్నారు. ఇవి రీసైక్లింగ్ అవుతున్నాయి. మరికొన్నిసార్లు రేషన్ బియ్యాన్ని అమ్మి బహిరంగ మార్కెట్లో రూ.40 – రూ.60 పెట్టి సన్న బియ్యాన్ని కొంటున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు పేదలపైనా ఆర్థిక భారం పడుతున్నది. పైగా, రేషన్ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పడుతున్నదన్న ఆరోపణలున్నాయి. వ్యాపారులు ఈ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొని మిల్లర్లకు అమ్ముతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మిల్లర్లు ఈ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎమ్మాఆర్లో ఎఫ్సీఐకి అంటగడుతున్నారని తెలుస్తోంది.