అన్లాక్- 4 లో భాగంగా కేంద్రం మెట్రో రైలు సేవలకు అనుమతిచ్చింది. దీంతో హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రో కార్యకలాపాలు గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించబడతాయి. మొదటి దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి.
రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గం) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి
మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక వీటి రెవెన్యూ సేవలు కేవలం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే గాంధీ ఆస్పత్రి, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్గూడ స్టేషన్లు మూసివేయనున్నారు.