- 374 మిలియన్ డాలర్లతో కుదిరిన ఒప్పందం
- రక్షణ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఇండియా
న్యూఢిల్లీ: మన బ్రహ్మోస్ మిస్సైల్స్ను కొనుగోలు చేసేందుకు మొదటి ఆర్డర్ వచ్చింది. తమకు యాంటీ షిప్ బ్రహ్మోస్ మిస్సైల్కావాలని ఇండియాతో ఫిలిప్పీన్స్ ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ఫిలిప్పీన్స్లో ఇండియా అంబాసిడర్ శంభుకుమారన్ సమక్షంలో ఈ ఎంవోయూ కుదిరింది. దీనిపై అక్కడి డిఫెన్స్ మినిస్ట్రీ ప్రతినిధులు, మన డీఆర్డీవో ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పందం విలువ 374 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,800 కోట్లు). రష్యా, ఇండియా కలిసి బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్)లో తయారు చేస్తున్న ఈ మిస్సైల్స్ సూపర్ సోనిక్ స్పీడ్తో దూసుకుపోయి లక్ష్యాలను ఛేదించగలవు. సబ్మెరైన్స్, షిప్స్, విమానాలు, భూమి పైనుంచి వీటిని ప్రయోగించవచ్చు. రక్షణ రంగానికి అవసరమైన మిసైల్స్ను, ఇతర సామాగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇండియా ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అయితే.. ఫిలిప్పీన్స్ ఎన్ని మిస్సైల్స్ కోసం ఆర్డర్ ఇచ్చిందనేది బయటకు రాలేదు. బాధ్యతాయుతమైన ఎగుమతులను ప్రోత్సహించే ఇండియా పాలసీలో ఈ ఒప్పందం ఓ ముందడుగు అని, ఫిలిప్పీన్స్తో సంబంధాలు మరింత బలపడుతాయని మన డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.
చైనా ఆగడాలను అరికట్టేందుకే..!
చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే మన దేశం లడఖ్, అరుణాచల్ సరిహద్దు ప్రాంతాల్లో పలు బ్రహ్మోస్ మిసైల్స్ను మోహరించింది. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా దీటుగా ఎదుర్కొనేందుకు వీటిని అక్కడ ఉంచింది. ఫిలిప్పీన్స్కు కూడా చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో.. బ్రహ్మోస్ బ్రహ్మాస్తంగా ఉపయోగపడుతుందని ఆ దేశం ఒప్పందం చేసుకుంది. మనం తయారు చేస్తున్న డిఫెన్స్ ఆయుధాలు, మిస్సైల్స్కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్రెడ్డి అన్నారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాశ్, అస్త్ర, యాంటి ట్యాంక్ మిసైల్స్, రాడార్స్, టోర్పెడోస్ వంటి వాటికి ఆర్డర్ ఇచ్చేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు.