
న్యూఢిల్లీ: దునియాకు మహమ్మారిలా తగులుకున్న కరోనా వైరస్ పీడ ఎప్పుడు పోతది? సొసైటీ మళ్లా మామూలు స్థితికి ఎప్పుడొస్తది? అని అడిగితే.. ఇండియన్లు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారట. ‘‘ఏ.. మనదగ్గర అది కంట్రోల్ లోనే ఉంటది. మహా అంటే మరో మూడు నెలల్లో ఖతమైపోతది. ప్రపంచం కంటే ముందే మనతాన ఆ వైరస్ పీడ విరగడైపోతది.. ” అని దాదాపు సగం మంది చెప్తున్నారట. ఇటీవలి ఓ సర్వేలో ఈ సంగతులు తెలిశాయని ‘ఐఏఎన్ఎస్’ వార్తా సంస్థ వెల్లడించింది. వచ్చే 3 నెల్లలోపు అంటే.. జులై చివరినాటికి దేశంలో కరోనా సంక్షోభం దాదాపు ముగిసిపోతుందని సర్వేలో 48% మంది ఇండియన్లు చెప్పారట. ప్రపంచవ్యాప్తంగా 3 నెల్లలోనే వైరస్ అంతమైపోతుందని 40% మంది అనుకుంటున్నారట. ఇక ఆగస్ట్, అక్టోబర్ దాకా ఇది ఉండకపోవచ్చని 32% మంది నమ్ముతున్నారని ఈ సర్వేలో తేలింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇది అక్టోబర్ నాటికి అంతమైతదని అనుకుంటున్నట్లు 36% మందే చెప్పారని వెల్లడైంది. ‘‘అంతలేదు.. కరోనా మహమ్మారి మనదేశంలో నవంబర్ లేదా డిసెంబర్ ఆఖరు వరకూ ఉంటుంది. అయితే దేశంలో ఇది కంట్రోల్లోనే ఉంటుంది” అని 7% మందే నమ్ముతున్నారని సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది చివరినాటికి కరోనా ఖతమైపోవచ్చని దేశంలో న మ్ముతున్నోళ్లు 10% మందే ఉండటం గమనార్హం.
మనోళ్లు ఇంకా ఏం అనుకుంటున్రంటే..?
- లాక్ డౌన్ ఎత్తేశాక..: దేశంలో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తే.. ముందుగా ఎక్కడికి వెళతారని అడగగా.. పార్కులు, కాలేజీలు, యూనివర్సిటీలు, మాల్స్, సినిమా హాల్స్ కు పోతామని 27% మంది చెప్పారు. రెస్టారెంట్లు, హోటళ్లకు పోతామని 25% మంది చెప్పారు. ప్రతి 10 మందిలో ముగ్గురు (31%) ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను చూసేందుకు వెళతామన్నారు.
- కేసులు తగ్గిపోయాక..: కరోనా కేసులు తగ్గిపోయాక మనదేశంలోనే ఏదైనా మంచి ప్లేస్ కు టూర్ కు పోతామని 23% మంది చెప్పారు. విదేశాల్లో కేసులు పూర్తిగా తగ్గిపోయాక ఫారిన్ టూర్లకు పోతామని 20% మంది అన్నారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే టూర్ల సంగతి ఆలోచిస్తామని 20% మంది తేల్చేశారు.
- తిరిగి పనిలోకి..: గవర్నమెంట్ ఆంక్షలు సడలించిన వెంటనే తాము ఆఫీసులకు వెళతామని 29% మంది చెప్పారు. షాపులు, కంపెనీలు తెరిచాక తిరిగి పనికి వెళతామని ఐదో వంతు మంది వెల్లడించారు.
- వైరస్ వల్ల పాఠాలు: మన దగ్గర ఉన్నదానికి విలువ ఇచ్చి, దానిని కాపాడుకోవాలన్న పాఠాన్ని కరోనా నేర్పిందని 50% మంది తెలిపారు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, వ్యక్తులను, మన సన్నిహితులను మనస్ఫూర్తిగా అభినందించేలా చేసిందని కూడా వీరు అభిప్రాయపడ్డారు.
- కాలుష్యం పోయింది: కరోనా వైరస్ వల్ల కాలుష్యం బాగా తగ్గిపోయి, ఎన్విరాన్మెంట్ కు అతిపెద్ద మేలు జరిగిందని ఈ సర్వేలో 68% మంది అభిప్రాయపడ్డారట. ముంబైలోకి వేలాది ఫ్లెమింగోలు రావడం, వీటి సంఖ్య గత ఏడాది కంటే ఈసారి 25% ఎక్కువగా పెరగడాన్నీ పలువురు ప్రస్తావించారట.
- టెక్నాలజీ మెరుగైతది: కరోనా విపత్తు మరింత మెరుగైన టెక్నాలజీకి దారి తీస్తదని 43% మంది సర్వేలో తెలిపారు. దేశంలో సప్లై చైన్ మరింత బలోపేతం అవుతుందని 35% మంది అన్నారు. సమాజంలో పోలరైజేషన్ తగ్గుతుందని 27% మంది చెప్పారు. కరోనా వల్ల జరిగే మంచి ఏమీ ఉండదని కేవలం 6% మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.