న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పేమెంట్స్ సెక్టార్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉందని, పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు. ఇందుకోసం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ మెయిన్ ఆబ్జెక్ట్స్ క్లాజ్ని మార్చడానికి ఇటీవలే ఢిల్లీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం పొందింది. కొత్త రూల్ను చేర్చడం ద్వారా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్సు పొందడానికి వీలవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 26న జరిగిన ఏజీఎంలో కంపెనీ వాటాదారులు ఇందుకోసం ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐఆర్సీటీసీ పేమెంట్ అగ్రిగేటర్గా లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని నాన్- బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్లకు పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం, 2007 ప్రకారం ఆర్బీఐ నుంచి పర్మిషన్ అవసరం. దరఖాస్తు చేసే సంస్థ ఇందుకోసం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంఓఏ)లో మార్పులు చేయాలి.
ఐఆర్సీటీసీకి ఇప్పటికే ‘ఐ పే’ పేరుతో ఇంటర్నల్ పేమెంట్ గేట్వే ఉంది. ఇది ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లో రైలు, బస్సు విమాన ప్రయాణ టిక్కెట్లు, టూర్ ప్యాకేజీల బుకింగ్ కోసం పేమెంట్లను తీసుకుంటుంది. “ఐఆర్సీటీసీకి ఇప్పటికే పెద్ద మొత్తంలో యూజర్ బేస్ ఉంది. అందుకే పేమెంట్ సేవలపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చు. ఆర్బిఐ ఆమోదం పొందిన తర్వాత ఇది ఇతర వ్యాపారులతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. చాలా ఆఫర్లను కూడా అందించవచ్చు ”అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేమెంట్ అగ్రిగేటర్గా ఐఆర్సీటీసీ అన్ని రకాల ఎలక్ట్రానిక్ వర్చువల్ పేమెంట్, పేమెంట్ గేట్వే, అగ్రిగేటర్ సేవలు, ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ పేమెంట్ల సేవలు అందిస్తుంది. యుటిలిటీ బిల్లులు, ఫీజులు మునిసిపల్ పన్నుల కోసం బిల్ పేమెంట్ సేవలను అందించడానికి బిల్లు పేమెంట్ గేట్వేగా కూడా పనిచేస్తుందని ఐఆర్సీటీసీ వర్గాలు తెలిపాయి.