కేసీఆర్, జగన్లకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , వైఎస్ జగన్లకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శనివారం లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా లేకుండా కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని ఆ లేఖలో స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి సంబంధించి చర్చించడానికి వీలైనంత త్వరగా భేటీ కావాలని లేఖలో కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని షెకావత్ విమర్శించారు
2016 సెప్టెంబర్ లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదని లేఖలో పేర్కొన్నారు గజేంద్ర సింగ్. అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్లో ఉండిపోయిందన్నారు. విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉందని తెలిపారు. 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారని, వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరామని తెలిపారు.మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసిందని… అయినా అ లేఖలపై ఎలాంటి స్పందన లేదన్నారు.
2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసిందని తెలిపారు. ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని చెప్పారు. అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప – పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయన్నారు. జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగిందని, వాటి డీపీఆర్లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేకపోవడంతో ఆ డీపీఆర్లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ చెబుతోందన్నారు
అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన 2 ఏపీ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదన్నారు. ‘అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి మే 20న లేఖ రాసింది. రెండు ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాల్సిందిగా కృష్ణా బోర్డు ఆదేశించినా, ఏపీ ప్రభుత్వం సమర్పించలేదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ పథకం కోసం టెండర్లు పిలిచినట్టు మా దృష్టికొచ్చింది. ఈ పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ సర్కారు ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరాదు’ అని గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ సీఎం కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుకుంటున్నానని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లేఖలో తెలిపారు.