తాగిన మైకంలో జవాన్​ను చంపేసిండు

తాగిన మైకంలో జవాన్​ను చంపేసిండు

బర్త్​డే పార్టీలో విషాదం
పరారీలో నిందితుడు

నర్సంపేట, వెలుగు: బర్త్​డే వేడుకల్లో అపశృతి దొర్లింది. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్​మధ్య మాటామాటా పెరిగి జరిగిన వాగ్వాదం  ఓ ఆర్మీ జవాన్​ హత్యకు దారితీసింది. ఎస్సై నాగనాథ్​​వివరాల ప్రకారం నర్సంపేట పట్టణానికి చెందిన హన్మకొండ ప్రేమ్​కుమార్(29) జమ్ముకాశ్మీర్ లో ఎస్ఎస్ బీ కానిస్టేబుల్ గా చేస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవులపై ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి 11 గంటలకు ఫ్రెండ్​బర్త్​డేకి వెళ్లారు. అప్పటికే మద్యం తాగిన బత్తుల రాకేశ్ తోపాటు దూదిమెట్ల దిలీప్, బీరం భరత్ రెడ్డి, దూదిమెట్ల నాగరాజు, ఎస్కే బబ్లూ, బత్తుల రాజు గొడవ పడుతున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా దూదిమెట్ల దిలీప్​కత్తితో ప్రేమ్​కుమార్​గుండెపై పొడిచాడు.

రక్తపు మడుగులో ఉన్న ప్రేమ్ కుమార్​ను మొదట నర్సంపేట హాస్పిటల్​కు, అనంతరం ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.  ప్రేమ్​కుమార్​తండ్రి రమేశ్​ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. బీటెక్​చదువుతున్న దిలీప్​దగ్గర కత్తి ఎందుకు ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.