బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జా బాగోతం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జా బాగోతం

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చంగోముల్ లో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరుల భూ కబ్జాకు పాల్పడినట్లు తెలుస్తోంది. చంగోముల్ గ్రామానికి చెందిన  నవీన్ అనే వ్యక్తి 346 సర్వే నంబర్ లో గడీల శ్రీనివాస్ నుండి నాలుగు ఎకరాల భూమి రెండు నెలల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు..బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని నవీన్ సహచర మిత్రులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ తో ఫెన్సింగ్ విర్రగొట్టి, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారని...తమ బైక్ కూడా తగలబెట్టారని...ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

 ఆ భూమితో వారికి ఎలాంటి సంబంధం లేదని..ఎమ్మెల్యే సపోర్ట్ తోనే వారు తమ భూమి కబ్జా చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.ఈ భూమికి సంబంధించిన ఇరువర్గాల పంచాయతీనీ స్వయంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓ ఫాం హౌజ్ లో నిర్వహించడం విశేషం. జరిగిందేదో జరిగిపోయింది... కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు...ఆ భూమిని తన అనుచరులకు వదిలేయాలంటూ ఎమ్మెల్యే వారికి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల కొందరు బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఎఫ్ఐర్ నుండి తొలగించాలని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు. బాధితులకు బాసటగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి నాయకులు నిలిచారు. దళితులపై దాడులకు తెగబడితే దళితులందురు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. దళితులపై వివక్ష చూపుతూ దాడులు చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠినంగా చర్యలు తీసుకొని.... బాధుతులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

భూ సెటిల్ మెంట్ ఆరోపణలపై స్పందించిన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి..

ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదంటున్నారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. పంచాయతీ తన వద్దకు వచ్చింది వాస్తవమేనని రాజీ కుదుర్చుకోమని చెప్పానని అన్నారు. తాను ఎలాంటి సెటిల్ మెంట్ చేయలేదని వెల్లడించారు. నవీన్ ఎవరో తనకు తెలియదు..కావాలని కొందరు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో గురించి తనకు తెలియదన్న ఎమ్మెల్యే.. తాను వీడియో ఇప్పుడే చూస్తున్నాను.. వివరాలు కావాలంటే వెళ్ళి ఓనర్ ను బాధితులను అడి తెలుసుకోవచ్చాని చెప్పారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.