సోమవారం(ఏప్రిల్ 27, 2026) సాయంత్రం హైదరాబాద్ సిటీని ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్మేశాయి. దీంతో నగరమంతా చీకట్లు కమ్ముకున్నాయి. భానుడి ప్రతాపంతో ఉదయం నుంచి నిప్పుల కొలిమిని తలపించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో పెద్ద ఎత్తున మబ్బులు కమ్ముకున్నాయి. పలుచోట్ల వర్షం కురిసింది. సిటీలోని ఆర్సీ పురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి , హెచ్ సీయూ, గచ్చిబౌలి, షేక్ పేట్, మియాపూర్ , షేక్ పేట్ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. రాత్రికి హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ జాగిర్, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సైబరాబాద్ పరిధిలోని నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
సోమవారం.. హైదరాబాద్ సిటీతో పాటు సిటీని ఆనుకొని ఉన్న మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

