- 50 వేల ఏండ్ల కింద.. మలేరియా పారాసైట్ లో మ్యుటేషన్
- అందువల్లే గొరిల్లాలను వదిలి మనుషుల మీద పడ్డది
- బ్రిటన్ సైంటిస్టుల రీసెర్చ్లో వెల్లడి.. కొత్త టీకా తయారీకి చాన్స్
ప్రాణాంతకమైన మలేరియా బ్యాక్టీరియా ఒకప్పుడు దోమల్లో కాకుండా ఆఫ్రికన్ గొరిల్లాల్లోనే జీవించేదట. గొరిల్లాలకు మనుషులు కాస్త దూరం కాబట్టి అప్పట్లో మలేరియా ముప్పు ఉండేది కాదట. అయితే.. 50 వేల ఏండ్ల కిందట మలేరియా పారాసైట్లోని జీన్స్కు జరిగిన మార్పులే ఇప్పుడు మనుషుల ప్రాణాల మీదికి వచ్చిందని బ్రిటన్లోని వెల్కమ్ సేంజర్ ఇనిస్టిట్యూట్ రీసెర్చర్లు వెల్లడించారు. మలేరియా జ్వరం వల్ల ఏటా వందల మంది బలి అయిపోతున్నారు. వాస్తవానికి నాలుగు రకాల పారాసైట్ల వల్ల మలేరియా వస్తుంది. కానీ.. ప్లాస్మోడియం ఫాల్సిపారం రకం పారాసైట్ మన వంట్లోకి చేరితే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో గొరిల్లాల్లోనే ఈ ప్లాస్మోడియం ఫాల్సిపారం బ్యాక్టీరియా ఉండేది. అంటే ఇవి దోమల్లో జీవించేవి కావు. అందుకే దోమకాటు వల్ల ఇది మనుషులకు వ్యాపించే అవకాశం ఉండేది కాదు.
అప్పట్లో ఏం జరిగిందంటే..
సుమారు 50 వేల ఏండ్ల కిందట ప్లాస్మోడియం ఫాల్సిపారంలో జన్యు మార్పు జరగడం వల్ల అది గొరిల్లాలను వదిలి అనాఫిలస్ దోమల్లో జీవించేందుకు అనుకూలంగా మారిపోయిందట. అప్పట్లో ఒక గొరిల్లాకు ఒకే సమయంలో ఫాల్సిపారంతో పాటు వేరే రకానికి చెందిన ప్లాస్మోడియం పారాసైట్ సోకి ఉంటుందని, అప్పుడు రెండింటి మధ్య డీఎన్ఏ పదార్థం మార్పిడి జరిగి ఉంటుందని సేంజర్ ఇనిస్టిట్యూట్ రీసెర్చర్ల టీం చీఫ్ డాక్టర్ గేవిన్ రైట్ తెలిపారు. దీనివల్ల ఫాల్సిపారం డీఎన్ఏలోకి ఆర్ హెచ్5 అనే జీన్ కొత్తగా రావడంతో ఆ పారాసైట్ దోమల్లో నివసించేందుకు అనుకూలంగా మారిందన్నారు. మలేరియా పారాసైట్కు చెందిన రెండు పురాతన రకాలపై పరిశోధనలు చేయగా ఈ విషయం తెలిసిందన్నారు. అయితే, ఫాల్సిపారంలోని ఆర్ హెచ్5 జీన్ను కంట్రోల్ చేసేలా కొత్త టీకాలు తయారు చేస్తే.. మలేరియాను నిర్మూలించేందుకు వీలవుతుందని, అందుకే ఈ జీన్ పై మరింత రీసెర్చ్ చేస్తున్నామని సైంటిస్టులు పేర్కొన్నారు.