మావోయిస్టు సట్వాజీ సరెండర్

మావోయిస్టు సట్వాజీ సరెండర్
  • జార్ఖండ్‌ పోలీసుల ముందు లొంగుబాటు
  • నేడు అధికారికంగా ప్రకటించనున్న రాష్ట్ర పోలీసులు
  • మూడున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే
  • మెరుపు దాడులు చేయడంలో దిట్ట
  • సట్వాజీపై కోటి, భార్యపై రూ.25 లక్షల రివార్డు

ఆదిలాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్‌‌చార్జి ఉగ్గు ఒరియర్ అలియాస్ సట్వాజీ అలియాస్ సుధాకర్ తన భార్య నీలిమతో కలిసి జార్ఖండ్ పోలీసుల ముందు లొంగిపోయినట్టు సమాచారం. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన ఈయన ప్రస్తుతం జార్ఖండ్‌‌ మావోయిస్టు పార్టీ ఇన్‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐదు రోజుల కిందటే వీరు రాంచీలో లొంగిపోయినట్టు తెలుస్తోంది. జార్ఖండ్ పోలీసులు రెండ్రోజుల కిందట
వారిని తెలంగాణ పోలీసులుకు అప్పజెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వారి లొంగుబాటుపై రాష్ట్ర పోలీసులు మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. సట్వాజీపై కోటి రూపాయలు, ఆయన భార్య నీలిమపై రూ.25
లక్షల రివార్డు ఉంది. మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరు పొందిన సట్వాజీ.. ఆరోగ్యం సహకరించకపోవడం, పార్టీలో నెలకొన్న సంక్షోభంతో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోదరుడి పట్టివేతతో..
2018 ఏప్రిల్‌‌లో సట్వాజీ సోదరుడు నారాయణ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల దేవేందర్రెడ్డి రాంచీలో జార్ఖండ్ పోలీసులకు పట్టుబడ్డారు. సట్వాజీ దగ్గర్నుంచి రూ.50 లక్షలు, బంగారంను తీసుకువస్తుండగా అక్కడి ఇంటెలిజెన్స్‌ విభాగం వీరిని పట్టుకుంది. అప్పట్నుంచి జార్ఖండ్ పోలీసులు సట్వాజీ లొంగుబాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నారాయణ అందించిన సమాచారంతో అక్కడి పోలీసులు రాష్ట్ర పోలీసులతో సంయుక్తంగా ఈ సరెండర్ ఆపరేషన్‌‌‌‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఎస్పీ కూడా సట్వాజీ తల్లి దేవుబాయితో సంప్రదింపులు జరిపి లొంగుబాటు కోసం ప్రయత్నించారు. దాదాపుగా ఎనిమిది నెలల నుం చి జార్ఖండ్, తెలంగాణ పోలీసులు సట్వాజీ లొంగుబాటుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
1984లో అజ్ఞాతంలోకి..
సట్వాజీ 1984లో అజ్ఞా తంలోకి వెళ్లాడు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యమంలో కొనసాగిన సట్వాజీ అంతకుముందు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్‌‌‌‌లో పనిచేశాడు. రాష్ట్ర కమిటీలో కిరణ్ పేరుతో కొరియర్‌‌‌‌గా పనిచేశాడు. 1986లో కర్నాటకలోని గుల్బర్గాలో అరెస్టయి 1989లో జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పుడు పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌పై నిషేధం ఎత్తివేయడంతో బహిరంగ కార్యకలాపాలు కొనసాగించాడు. అదే సమయంలో సట్వాజీ నిర్మల్‌ లో భారీ స్థూపం నిర్మించాడు. 1990లో నెలవెల్లి వద్ద గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో అప్పటి ప్రభుత్వం నిర్బంధం మొదలుపెట్టింది. దీం తో ఆయన
అదే సంవత్సరం తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి చెన్నూర్ దళ కమాండర్‌‌‌‌గా సుధాకర్ పేరుతో కార్యకలాపాలు కొనసాగించాడు. 1993 వరకు సిర్పూర్ దళ కమాండర్‌‌‌‌గా కొనసాగాడు. 1992లో పీపుల్స్‌‌‌‌ వార్‌‌‌‌ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1998లో పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. దాదాపు రెండున్నరేళ్ల పాటు జిల్లా
కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2000లో ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడిగా, తర్వాత దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్‌‌‌‌చార్జిగా పనిచేశాడు. అనంతరం ఆంధ్రా ఒడిశా బోర్డర్ దళానికి కూడా నాయకత్వం వహించాడు. 25 ఏళ్లపాటు
అజ్ఞాతంలో పని చేసిన ఆయన్ను కేంద్ర పొలిట్‌‌‌‌బ్యూరో సభ్యు డిగా మావోయిస్టు పార్టీ నియమించింది.

మెరుపు దాడుల్లో సిద్ధహస్తుడు
సట్వాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా  పనిచేసిన  సమయంలో అనేక సంఘటనలు జరిగాయి. 1992, 1993 మధ్యలో పెంచికలపేట,
నెన్నెల తదితర మండలాల్లో మిలిటరీ అంబుష్ నిర్వహించి పోలీసులను హతమార్చిన సంఘటనకు ఈయనే నేతృత్వం వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. సిర్పూర్, గాజుల
నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పేల్చివేత ఘటనల వెనుక సట్వాజీ పాత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నెన్నెల ఎంపీపీ, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితర  ప్రజాప్రతినిధుల హత్య ఘటనల వెనక కూడా సట్వాజీ ప్రమేయం ఉందని పోలీసులు భావించారు. రిక్రూట్‌‌‌‌మెంట్లు కూడా ఆయన హయాంలోనే భారీగా జరిగాయని చెబుతారు.