కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

 

  • తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి
  • టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం
  • వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి
  • బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన
  • అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి
  • ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కాంట్రాక్ట్​ సంస్థలతోనే చేయించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్​రెడ్డి తేల్చి చెప్పారు. వానాకాలం ప్రారంభమవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో మరమ్మతులను స్పీడప్​ చేయాలన్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లను ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, కాసిపేట పంప్​హౌస్​లనూ పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. శనివారం ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియెట్​లో మేడిగడ్డపై రివ్యూ చేశారు. బ్యారేజీ పునరుద్ధరణపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్​ఏ) నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులేమిటి.. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి.. అనే దానిపై సీఎం రేవంత్​ ఆరా తీశారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డి పాల్గొన్నారు. 

టెస్టులు, రిపేర్లు ఒకేసారి!

బ్యారేజీలకు రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని ఎల్​ అండ్​ టీ, అన్నారం బ్యారేజీని అఫ్కాన్స్​– విజేత – పీఈఎస్​, సుందిళ్లను నవయుగ సంస్థలు నిర్మించాయి. బ్యారేజీ రిపేర్లకు తొలుత నో చెప్పిన ఎల్​ అండ్​ టీ సంస్థ ఆ తర్వాత ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా బ్యారేజీలకు వాటిని నిర్మించిన సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సీఎం రేవంత్ మరోమారు​ స్పష్టం చేశారు. ఎన్డీఎస్​ఏ నిపుణుల కమిటీ సూచించిన పలు జియోఫిజికల్​ టెస్టులను ప్రభుత్వం తరఫున చేయించేందుకు నిర్ణయించారు. బ్యారేజీల్లోని సీకెంట్​ఫైల్స్​, షీట్​ ఫైల్స్​ స్ట్రెంత్​ను తెలుసుకోవడంతో పాటు బ్యారేజీలకు డౌన్​స్ట్రీమ్, అప్​స్ట్రీమ్​లలో చేయాల్సిన జియోఫిజికల్​ టెస్టులు, బ్యారేజీ ఫౌండేషన్​ గట్టిదనాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ను ప్రభుత్వమే చేయించాలని డిసైడ్​ అయ్యారు. కమిటీ సూచించినట్టుగా ఆయా టెస్టులను ఢిల్లీలోని సెంట్రల్​ సాయిల్​ అండ్​ మెటీరియల్స్​ రీసెర్చ్​ స్టేషన్ (సీఎస్​ఎంఆర్​ఎస్​), పుణెలోని సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్), హైదరాబాద్​లోని నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్ (ఎన్జీఆర్​ఐ​)తో చేయించాలని నిర్ణయించారు. అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఇరిగేషన్​ అధికారులతో చర్చించాలి

మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున బ్యారేజీల మరమ్మతులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్​ నేపథ్యంలో కేబినెట్​ సమావేశం జరగకపోవడంతో వాటిపై డిటైల్డ్​గా చర్చించలేకపోతున్నామని అన్నారు. బ్యారేజీలకు రిపేర్లు, ప్రత్యామ్నాయాలపై ముందుగా ఇరిగేషన్​ అధికారులతో చర్చించాల్సి ఉందని, బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

బ్రేసింగ్​, గేట్ల తొలగింపే పెద్ద పని 

మూడు బ్యారేజీల్లో అతిపెద్ద పని మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన పిల్లర్లకు బ్రేసింగ్​ చేయడమేనని అధికారులు చెప్తున్నారు. పిల్లర్లకు తప్పనిసరిగా బ్రేసింగ్​ చేయాలని చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వంలోని ఎన్డీఎస్​ఏ కమిటీ సిఫార్సు చేసింది. పెద్ద వరద వచ్చినా పిల్లర్లు మరింత కుంగకుండా లేదా మరింత డ్యామేజీ కాకుండా తాత్కాలిక ఉపశమన చర్యల కింద ఇనుము లేదా పిల్లర్లను నిలబెట్టే వస్తువులతో బ్రేసింగ్​ చేయాలని పేర్కొంది. కాగా, వర్షాకాలం దగ్గరపడుతున్నా.. ఎన్డీఎస్​ఏ కమిటీ రిపోర్ట్​ వచ్చి వారం పది రోజులవుతున్నా నిర్మాణ సంస్థలు పనులు మొదలుపెట్టలేదు. కేవలం గేట్లను మాత్రమే తెరిచారు. దాంతో పాటు పూర్తిగా తొలగించాల్సిన 20, 21వ నంబర్​ గేట్ల పనులూ స్టార్ట్​ కాలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్​రెడ్డి ఆయా పనులపై సీరియస్​గా దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. 

రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్న కమిటీ

ఎన్డీఎస్​ఏ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్​తో పాటు మంత్రులకు ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వివరించారు. కాళేశ్వరం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని కమిటీ తన రిపోర్టులో తెలిపిందని ఆయన అన్నారు.