
- తేల్చిచెప్పిన సీఎం రేవంత్రెడ్డి
- టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం
- వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి
- బ్యారేజీలతో పాటు పంప్హౌస్ల పరిశీలన
- అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి
- ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కాంట్రాక్ట్ సంస్థలతోనే చేయించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. వానాకాలం ప్రారంభమవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో మరమ్మతులను స్పీడప్ చేయాలన్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లను ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, కాసిపేట పంప్హౌస్లనూ పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. శనివారం ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియెట్లో మేడిగడ్డపై రివ్యూ చేశారు. బ్యారేజీ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులేమిటి.. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి.. అనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
టెస్టులు, రిపేర్లు ఒకేసారి!
బ్యారేజీలకు రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని ఎల్ అండ్ టీ, అన్నారం బ్యారేజీని అఫ్కాన్స్– విజేత – పీఈఎస్, సుందిళ్లను నవయుగ సంస్థలు నిర్మించాయి. బ్యారేజీ రిపేర్లకు తొలుత నో చెప్పిన ఎల్ అండ్ టీ సంస్థ ఆ తర్వాత ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా బ్యారేజీలకు వాటిని నిర్మించిన సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సీఎం రేవంత్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన పలు జియోఫిజికల్ టెస్టులను ప్రభుత్వం తరఫున చేయించేందుకు నిర్ణయించారు. బ్యారేజీల్లోని సీకెంట్ఫైల్స్, షీట్ ఫైల్స్ స్ట్రెంత్ను తెలుసుకోవడంతో పాటు బ్యారేజీలకు డౌన్స్ట్రీమ్, అప్స్ట్రీమ్లలో చేయాల్సిన జియోఫిజికల్ టెస్టులు, బ్యారేజీ ఫౌండేషన్ గట్టిదనాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ను ప్రభుత్వమే చేయించాలని డిసైడ్ అయ్యారు. కమిటీ సూచించినట్టుగా ఆయా టెస్టులను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో చేయించాలని నిర్ణయించారు. అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఇరిగేషన్ అధికారులతో చర్చించాలి
మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున బ్యారేజీల మరమ్మతులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరగకపోవడంతో వాటిపై డిటైల్డ్గా చర్చించలేకపోతున్నామని అన్నారు. బ్యారేజీలకు రిపేర్లు, ప్రత్యామ్నాయాలపై ముందుగా ఇరిగేషన్ అధికారులతో చర్చించాల్సి ఉందని, బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బ్రేసింగ్, గేట్ల తొలగింపే పెద్ద పని
మూడు బ్యారేజీల్లో అతిపెద్ద పని మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన పిల్లర్లకు బ్రేసింగ్ చేయడమేనని అధికారులు చెప్తున్నారు. పిల్లర్లకు తప్పనిసరిగా బ్రేసింగ్ చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సు చేసింది. పెద్ద వరద వచ్చినా పిల్లర్లు మరింత కుంగకుండా లేదా మరింత డ్యామేజీ కాకుండా తాత్కాలిక ఉపశమన చర్యల కింద ఇనుము లేదా పిల్లర్లను నిలబెట్టే వస్తువులతో బ్రేసింగ్ చేయాలని పేర్కొంది. కాగా, వర్షాకాలం దగ్గరపడుతున్నా.. ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ వచ్చి వారం పది రోజులవుతున్నా నిర్మాణ సంస్థలు పనులు మొదలుపెట్టలేదు. కేవలం గేట్లను మాత్రమే తెరిచారు. దాంతో పాటు పూర్తిగా తొలగించాల్సిన 20, 21వ నంబర్ గేట్ల పనులూ స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్రెడ్డి ఆయా పనులపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.
రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్న కమిటీ
ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని కమిటీ తన రిపోర్టులో తెలిపిందని ఆయన అన్నారు.