- స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య వర్గీయుల ధర్నా
స్టేషన్ఘన్పూర్, వెలుగు : ‘‘కడియం గోబ్యాక్’’ అని, బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే రాజయ్యకే కేటాయించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఆదివారం ఆయన వర్గీయులు ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వొద్దని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, సర్పంచ్ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నినాదాలు హోరెత్తించారు.
జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి మాట్లాడుతూ.. ఆనాడు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి ఏం త్యాగం చేసి వచ్చారో చెప్పాలని డిమాండ్చేశారు. కేవలం అధికారం కోసమే ఆయన పార్టీలో చేరారని ఆరోపించారు. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.
ధర్నాలో ఎంపీపీ కందుల రేఖ, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్రెడ్డి, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, గుర్రం రాజు, బీఆర్ఎస్ నాయకులు బొల్లు లక్ష్మి, కుందూరు జ్యోతిరెడ్డి, మారపాక రాములు, గుర్రం శంకర్, చింత శ్రీను, గోవిందు అశోక్, తాటికొండ రమేశ్, ఆకారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.