హైదరాబాద్ లో కొత్త రూల్: వెనుక కూర్చున్నాహెల్మెట్ ఉండాల్సిందే

హైదరాబాద్ లో కొత్త రూల్: వెనుక కూర్చున్నాహెల్మెట్ ఉండాల్సిందే

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంతో పాటు…ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా బైక్ పై వెళ్తున్న వారు తప్పని సరిగా హెల్మెట్ ఉండాలని  నిర్ణయించింది. అయితే గతేడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో బైక్ లపై వెనకాల హెల్మెట్ లేకుండా కూర్చుని.. ప్రమాదాల్లో 128 మంది చనిపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేశారు. ఇప్పటికే రాచకొండ పరిధిలో ఈ  రూల్ ను గత 15 రోజుల నుంచి అమలు చేస్తూ, హెల్మెట్ లేని 328 మందికి మొదటి తప్పుగా రూ. 100 చొప్పున ఫైన్ వేశారు.

ఓ వైపు మునిసిపల్ ఎన్నికలు, మరోవైపు వాహనదారులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో, ఇంతవరకూ హెల్మెట్ నిబంధనను చూసీ చూడనట్టు వదిలేశామని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. హెల్మెట్ విషయంలో పోలీసులకు కూడా మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

సైబరాబాద్ లో ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఇంతవరకూ అమలులో లేదు. రాచకొండ పోలీసులు పాటిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసిన సైబరాబాద్ అధికారులు..ముందే జరిమానాలు వేస్తే, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి, మొదట అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా వెనుక కూర్చుంటే… హెచ్చరించి వదిలేస్తామని, అదే తప్పు మరోసారి చేస్తే, జరిమానా తప్పదని అన్నారు. సోషల్ మీడియాలో హెల్మెట్ నిబంధన అమలుపై ప్రచారాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు.