ఆ ఎన్నికల కోసం పనిచేయను: ప్రశాంత్ కిషోర్

ఆ ఎన్నికల కోసం పనిచేయను: ప్రశాంత్ కిషోర్

పాట్నా: మధ్యప్రదేశ్​ లో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తాను అంగీకరించినట్లు వచ్చిన వార్తలను పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ ఖండించారు. మాజీ సీఎం కమల్ నాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలంటూ తనను సంప్రదించారని, కానీ అందుకు తాను అంగీకరించలేదని బుధవారం మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి తాను ఇష్టపడనని అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్​లో 24 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. త్వరలో వాటికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ గెలుపు కోసం తొలిసారి ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పోల్ స్ట్రాటజిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత అప్పటి బీజేపీ చీఫ్​ అమిత్​షాతో విభేదాల కారణంగా పార్టీ నుంచి విడిపోయారు.