పుణె: ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించిన దంపతులు రూ. 7 లక్షల విలువైన బ్యాగును దిగేముందు ఆటోలోనే మరచిపోయారు. అయితే ఆ బ్యాగులో ఉన్న 11 తులాల బంగారం, రూ .20,000 నగదును.. వెంటనే పోలీసులకు అప్పగించాడు. ఆటో డ్రైవర్ తన నిజాయితీతో అందరిచేత శభాష్ డ్రైవర్ అనిపించుకుంటుకున్నాడు.
పుణెలోని కేశవనగర్లో ఈ ఘటన జరిగింది. కేశవ్ నగర్ వద్ద ఒక జంట విఠల్ మాపారే అనే 60 ఏళ్ల వృద్ధుడి ఆటోలో ఎక్కారు. హడప్సర్ బస్టాండ్ వద్ద దిగారు. కానీ బ్యాగు మరిచిపోయారు. బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్ దాన్ని విప్పి చూడలేదు. యజమానులకు దాన్ని ఎలాగైనా అందజేయాలనే ఉద్దేశంతో పోలీసులకు అప్పగించాడు. వారు బ్యాగు తెరిచి చూడగా, విలువైన వస్తువులు కనిపించాయి. నిజాయితీ చూపిన ఆటో డ్రైవర్ను పోలీసులు అభినందించారు. అనంతరం బ్యాగును యజమానులకు అప్పగించారు. తనకు లభించిన ప్రశంసలే గొప్ప బహుమతిగా భావిస్తున్నట్లు తెలిపాడు మాపారే.