సోల్జర్ల త్యాగాలను ప్రధాని అవమానించారు

సోల్జర్ల త్యాగాలను ప్రధాని అవమానించారు
  • మోడీ పాలనలో దేశ ఎకానమీ ఆగమైందన్న కాంగ్రెస్ లీడర్
  • 15 ఏండ్లలో చేయని నితీశ్.. ఈ ఐదేళ్లలో చేస్తరా?: తేజస్వీ
  • బీహార్ హిసువా ర్యాలీలో పాల్గొన్న రాహుల్ , తేజస్వీ

హిసువా (బీహార్): గల్వాన్ ఘటనపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. చైనా ఆర్మీ మన ప్రాంతంలోకి చొరబడలేదని చెప్పి సైనికులను ప్రధాని అవమానించారని మండిపడ్డారు. బీహార్​లోని హిసువాలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో రాహుల్, ఆర్జేడీ లీడర్​ తేజస్వీ యాదవ్​ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్​ మాట్లాడుతూ.. ‘చైనా ఆర్మీ 1,200 కిలోమీటర్ల మేర మన భూమిని ఆక్రమించుకుంది. కానీ చైనా మన ప్రాంతంలోకి చొరబడలేదని సైనికులను మోడీ ఎందుకు ఇన్ సల్ట్ చేశారు?” అని రాహుల్ ప్రశ్నించారు. మన భూమిలో తిష్ట వేసిన చైనా ఆర్మీని ఎప్పుడు ఎల్లగొడతారని నిలదీశారు. లాక్ డౌన్ టైమ్ లో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే కేంద్రం ఎలాంటి సాయంచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు తలవంచి నమస్కరిస్తరు కానీ కష్టాల్లో వాళ్లను ఆదుకోరని విమర్శించారు. ‘బీహార్​లో 19 లక్షల జాబ్స్ ఇస్తామన్న బీజేపీ హామీ.. ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ లాంటిదే’నని రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రైతులు, చిన్న వ్యాపారులను  ప్రధాని మోడీ, సీఎం నితీశ్ ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

నితీశ్​జీ.. మీరు అలసిపోయారు: తేజస్వీ

కరోనా భయంతో 4 నెలలు ఇంట్లోనే ఉన్న బీహార్ సీఎం నితీశ్​కుమార్.. ఇప్పుడు ఓట్లేయమని అడగడానికి బయటకొచ్చారంటూ ఆర్జేడీ లీడర్​ తేజస్వీ యాదవ్​ విమర్శించారు. కరోనా లాక్​డౌన్​ తర్వాత 32 లక్షల మందికి పైగా ప్రజలు రాష్ట్రానికి వచ్చారని.. వాళ్లకు జాబ్స్​ఇస్తామని, స్కిల్​మ్యాపింగ్ చేస్తామని చెప్పారని, కానీ ఏంజరగలేదని అన్నారు. రాష్ట్రంలో దాదాపు సగం మంది జనం(46.6 %) పని లేక గోస పడుతున్నారని చెప్పారు. ‘మన సీఎం 144 రోజులు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే బయటకొచ్చారు. అప్పుడూ కరోనా ఉంది. ఇప్పుడూ ఉంది. ఇప్పుడాయనకు మీ ఓట్లు కావాలి. అందుకే అడుగు బయట పెట్టారు’ అని ఫైర్​ అయ్యారు. ‘ఈ 15 ఏండ్లల్లో నితీశ్​కుమార్​ ఉద్యోగాలిచ్చారా? పేదరికాన్ని పోగొట్టారా? హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల మాటేంటి? ఫ్యాక్టరీలేమయ్యాయి? ఇన్నేండ్లలో ఇవేవీ చేయని వాళ్లు వచ్చే ఐదేళ్లలో చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘నితీశ్​జీ మీరు అలసిపోయారు. బీహార్​ను జాగ్రత్తగా చూసుకోలేరు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీకి తేజస్వీ వెల్​కమ్​ చెబుతూనే బీహార్​ ప్యాకేజీ ఏమైందని నిలదీశారు