భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హరితహారంలో పెట్టిన మొక్కలు చనిపోతే ఆఫీసర్ల జీతాల్లోంచి రికవరీ చేస్తానని కలెక్టర్ఎంవీ రెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్నుంచి మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో1.06 కోట్ల మొక్కలు పెంచటం పట్ల సీఎం కేసీఆర్ అభినందించటం హర్షనీయమన్నారు. ఇదంతా జిల్లా ఆఫీసర్ల టీం వర్క్ అని చెప్పారు. మొక్కలు నాటటంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. మొక్కలు చనిపోతే సెక్రటరీ, ఎంపీడీవో, ఎంపీవోలను బాధ్యులు చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్లో వెనుకంజలో ఉన్న ఎంపీడీవో, ఎంపీవోలపై, రైల్వే అండర్బ్రిడ్జి, డివైడర్లపై పూల మొక్కలు నాటాలని పలుసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్కమిషనర్సంపత్కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారులపై పందులు, పశువులు తిరుగుతున్నాయని, కమిషనర్కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నాటికి నర్సరీలో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టకపోతే తీవ్ర నిర్లక్ష్యంగా భావించి డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తానని, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించారు. నూరు శాతం జియో ట్యాగింగ్ చేసిన మండలాల ఆఫీసర్లను అభినందించారు. రహదారులకిరువైపులా చెత్త ఉంటే సర్పంచ్లు, సెక్రటరీలను సస్పెండ్ చేయడానికి ఫైల్ తయారు చేయాలని డీపీవోను ఆదేశించారు. వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెల 16న మొదటి దశలో 8,907 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.