- లాభాల్లో ఆల్ టైం రికార్డ్
- సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్
హైదరాబాద్, వెలుగు : సింగరేణి సంస్థ చరిత్రలోనే ఈసారి అత్యధిక నికర లాభాన్ని సంపాదించింది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.33,065 కోట్ల టర్నోవర్ తో రూ.2,222 కోట్ల లాభాన్ని సాధించి రికార్డు సృష్టించింది. శుక్రవారం సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాదితో బొగ్గు, కరెంటు అమ్మకాల ద్వారా రూ.3,074 కోట్ల లాభం వచ్చిందని, ట్యాక్స్లు చెల్లించిన తర్వాత రూ.2,222 కోట్ల నికర లాభాలొచ్చాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు.
అంతకు ముందు ఏడాది వచ్చిన దానికన్నా ఈసారి 81 శాతం ఎక్కువ లాభాలొచ్చినట్టు చెప్పారు. టర్నోవర్ కూడా 24 శాతం ఎక్కువ సాధించామన్నారు. దేశంలోని మహారత్న కంపెనీల లాభాల వృద్ధి కన్నా కూడా సింగరేణి వృద్ధి చాలా ఎక్కువగా ఉందన్నారు. నాలుగేళ్లలో సింగరేణి 430 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా.. 241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండో స్థానంలో ఉందన్నారు.