- సేఫ్ హౌజ్ లేక స్టేషన్లలోనే మూటలు డీఎంసీలు లేక ఫైల్ కాని చార్జిషీట్లు
- ఏటా పట్టు బడుతున్నది వంద క్వింటాళ్లకు పైమాటే
- ఎక్కడ స్టోర్ చేయాలనేదానిపై నో క్లారిటీ
- శిక్షలు లేక మళ్లీ మళ్లీ దందా చేస్తున్న స్మగ్లర్లు
వరంగల్ రూరల్, వెలుగు: వైజాగ్, ఒడిశా నుంచి వయా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మీదుగా ముంబై స్మగుల్ అవుతున్న గంజాయిని తనిఖీల్లో గుట్టలుగుట్టలుగా పట్టుకుంటున్న రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఆఫీసర్లకు సరుకును ఎక్కడ స్టోర్ చేయాలో అర్థం కావట్లేదు. ఏటా వంద క్వింటాళ్లకు పైగా పట్టుబడుతున్న గాంజాను ఏం చేయాలో, ఎక్కడ దాయాలో తెలియక ఠాణాల్లోనే ఓ మూలన మూటలకు మూటలు పడేస్తున్నారు. మరో వైపు జిల్లాల్లో డిసిషన్ మేకింగ్ కమిటీలు (డీఎంసీలు) లేకపోవడంతో స్మగ్లర్లపై చార్జిషీట్లు దాఖలు కావట్లేదు. దీంతో స్మగర్లకు సరైన శిక్షలు పడకపోవడంతో మళ్లీ మళ్లీ అదే దందా చేస్తున్నారు.
21 గ్యాంగ్స్ యాక్టివ్రోల్
ఆంధ్రా, ఒడిశాలో గుట్టుగా సాగవుతున్న గంజాయిని స్మగ్లర్లు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మీదుగా ముంబై తరలిస్తున్నారు. మొత్తం 21 గ్యాంగ్స్ ఈ స్మగ్లింగ్లో యాక్టివ్రోల్ పోషిస్తున్నాయి. ట్రైన్లు, వివిధ వెహికల్స్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గాంజాను తెలంగాణ పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్కమిషనరేట్ల పరిధిలో రెగ్యులర్ పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ఫోర్స్టీంలు గంజాయి స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏటా స్టేట్వైడ్ వంద క్వింటాళ్లకు తగ్గకుండా పట్టుబడుతున్న గంజాయి పోలీస్స్టేషన్లలో గుట్టలుగా పేరుకుపోతోంది. కటకటాలు లెక్కించాల్సిన స్మగ్లర్లు మాత్రం అరెస్టయిన కొన్ని రోజులకే బయటకు వస్తున్నారు.
సేఫ్ హౌజ్ లేక ప్రొసీజర్ ఫాలో కావట్లే
గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు పడేలా అవసరమైన చార్జీషీట్ రెడీ చేయడంలో స్టేట్వైడ్ దాదాపు అన్ని పోలీస్ కమిషనరేట్లు రూల్స్ఫాలో కావట్లేదనే విమర్శలున్నాయి. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పట్టుబడిన గంజాయిని స్టోర్చేయడానికి డిపార్టుమెంట్కు ఒక సేఫ్ హౌజ్ ఉండాలి. కమిషనరేట్, జిల్లాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆ సేఫ్హౌజ్లోనే స్టోర్ చేయాలి. కేసు వివరాలు రిజిష్టర్ చేయడం మొదలుకొని నిందితులకు కోర్టు శిక్షలు ఖరారయ్యేవరకు పర్యవేక్షణ కమిటీ ఇక్కడి నుంచే పని చేయాలి. కాగా, ప్రస్తుతం ఆ తరహా ఫెసిలిటీస్ లేక పట్టుబడిన గంజాయిని కేసు నమోదైన పోలీస్ స్టేషన్లలోనే దాచిపెడుతున్నారు. ప్రొసీజర్ ప్రకారం సేఫ్ హౌజ్ లేకపోవడంతో కేసులు ముందుకెళ్లడం లేదు.
బలవుతున్న పేదలు
గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో పోలీస్ ఆఫీసర్లు సకాలంలో చార్జిషీట్ను కోర్టు బెంచ్ వరకు తీసుకెళ్లకపోవడం వల్ల అక్రమార్కులు బలాదూర్ గా బయట తిరుగుతున్నారు. అదే టైంలో ముఠాతో వెళ్లిన కొందరు పేదలు మాత్రం బలి పశువులు అవుతున్నారు. పోలీసులకు పట్టుబడ్డాక డబ్బులున్న స్మగ్లర్లు బెయిల్ తీసుకుంటుండగా.. మనీ సపోర్ట్ లేనివారు బెయిల్ తీసుకోలేక రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఇదేకాక మరో రకం బాధితులు ఉంటున్నారు. ఆరేడేళ్ల కింద తెలిసీ తెలియక ఇందులో నిందితులైన యువకులు బెయిల్ మీద బయటకొచ్చారు. ఆపై చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు లేటుగా చార్జిషీట్ వేసి నేరం రుజువైతే.. మారిన మనుషులు ఇప్పుడు జైలుపాలు కావాల్సి వస్తోంది. గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో శిక్షలు కఠినంగానే ఉన్నా.. వాటిని అమలు చేయడంలో ముఖ్యంగా డీఎంసీలు వేయడంలో సర్కారు ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రొంపిలో దిగేవారికి మొదట్లోనే ఫుల్స్టాప్ పెట్టే అవకాశమున్నా అలా జరగట్లేదు. దీంతో వందలాది మంది కళ్లముందే బడా స్మగ్లర్లు గా మారుతున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.
డిసిషన్ మేకింగ్ కమిటీల్లేవ్
మత్తు పదార్థాల స్మగ్లింగ్ కేసుల్లో డిసిషన్ మేకింగ్ కమిటీ(డీఎంసీ)లదే కీలక పాత్ర.ఇందులో కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, డ్రగ్స్.. ఇతరడిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మెంబర్లుగా ఉంటారు.దాడుల్లో దొరికిన స్టాక్, నేర తీవ్రత ఆధారంగా వారు రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే పోలీసులు చార్జి షీట్ దాఖలు చేస్తారు. రిపోర్టులోని ఎవిడెన్స్ ఆధారంగా కోర్టులు శిక్షలు ఖరారు చేస్తాయి. అదీగాక స్మగ్లర్ల వద్ద దొరికిన గంజాయిని మెడిసిన్ తయారీలో వాడే అవకాశం ఉంటుంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని గవర్నమెంట్ పరిధిలోని మెడిసిన్ తయారీలో ఎంత శాతం వాడుకోవాలో డీఎంసీ నిర్ణయిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఈ కమిటీలు పని చేయట్లేదు. దీంతో నిందితుల మీద చార్జిషీట్ వేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో స్మగ్లర్లు ఈజీగా బెయిల్ ద్వారా బయటకొచ్చి, మళ్లీ దందా సాగిస్తున్నారు
కమిటీలు వేస్తాం.. సేఫ్హౌజ్ చూస్తాం
గత కొన్నేండ్లుగా గంజాయి నిందితులకు కోర్టుల్లో పూర్తిస్థాయి శిక్షలు పడని విషయం వాస్తవమే. ఇలాంటి కేసుల్లో డిసిషన్ తీసుకునే కమిటీ బాధ్యులు వేరేచోటకు వెళ్లడం.. ప్రొసీజర్ ప్రకారం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని స్టోర్ చేయడానికి కమిషనరేట్ పరిధిలో సేఫ్ హౌజ్ లేకపోవడం కేసుల జాప్యానికి కారణం అయ్యాయి. త్వరలోనే కమిటీ ఫాం చేస్తాం. డీజీపీ పర్మిషన్ తీసుకుని సేఫ్హౌజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. చార్జీషీట్ వేయనివాటితో పాటు కోర్ట్ బెంచ్ ఎక్కని వాటిని పరిష్కరిస్తాం.
–ప్రమోద్ కుమార్, వరంగల్ సీపీ
180 రోజుల్లోగా చార్జీషీట్ వేయాలె
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి ఎన్డీపీఎస్ యాక్ట్ అందుబాటులో ఉంది. కేసు ఆధారంగా శిక్షలుంటాయి. స్మగ్లింగ్ చేసేవారికి నాన్బెయిలబుల్ కేసుతో పాటు యావజ్జీవం పడే చాన్స్ ఉంది. అయితే ఎఫ్ఐఆర్ నమోదయ్యాక 180 రోజుల్లోపు చార్జీషీట్ వేయాల్సి ఉంటుంది. లేదంటే కేసు ఏళ్ల తరబడి సాగి .. అసలు దొంగలు తప్పించుకునే అవకాశం ఉంటుంది.–పద్మజ, సీనియర్ అడ్వకేట్, వరంగల్