IFFIకి ఎంపికైన ‘కిడ’.. 'స్రవంతి' రవికిశోర్ హర్షం

IFFIకి ఎంపికైన ‘కిడ’..  'స్రవంతి' రవికిశోర్ హర్షం

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2022లో ఇండియన్ పనోరమాకు ‘కిడ' సినిమా ఎంపికవడం పట్ల ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ హర్షం వెలిబుచ్చారు. ఫీచర్ ఫిల్మ్స్‌ విభాగంలో  తాను నిర్మించిన తమిళ సినిమా 'కిడ' ఎంపికైందన్నారు. ఇండియన్ పనోరమాకు మొత్తం 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయని తెలిపారు.  'కిడ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయని, అన్ని భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని  ఆయన వెల్లడించారు. ఇది పేరుకు తమిళ చిత్రమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో యూనివర్సల్ అయ్యిందన్నారు.  

కంబూర్ అనే కుగ్రామంలో చిత్రీకరణ...

‘‘తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న కంబూర్ అనే కుగ్రామంలో 'కిడ' చిత్రీకరణ చేశాం. ముఖ్యంగా తమిళ ప్రజలకు దీపావళి పెద్ద పండగ. పల్లెల్లో ఎవరైనా సరే తమ తాహతుకు మించి పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వాలని తాపత్రయపడుతుంటారు. కొనిచ్చిన తర్వాత తామే దుస్తులు ధరించినట్టు ఆనందపడతారు. ఈ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. మనవడి కోసం ఓ తాతయ్య తనకు తానే ఓ ఛాలెంజ్ విసురుకుంటాడు. ఆ ఛాలెంజ్ ఏమిటన్నది సినిమాలో చూడాలి. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులను తాకే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. ఎమోషనల్ చిత్రమిది’ అని స్రవంతి' రవికిశోర్ వివరించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.