- రెండున్నర ఏండ్లుగా ‘టెట్’ లేదు
- ఇంకా భర్తీ దశలోనే ‘టీఆర్టీ–2017’
- వచ్చే సమ్మర్లో స్కూళ్ల రేషనలైజేషన్
- మిగిలిపోయే టీచర్లు తక్కువున్న చోటుకు
- మారుమూల పల్లెల్లో సర్కారు చదువు కష్టమే!
- డీఈడీ, బీఈడీ చేసి ఎదురుచూస్తున్నఐదున్నర లక్షల మంది
హైదరాబాద్, వెలుగు: ఇప్పట్లో టీచర్ పోస్టుల భర్తీ లేనట్టే కొడుతోంది. రెండున్నరేళ్లుగా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించకపోవడం, వచ్చే ఎండాకాలంలో స్కూళ్ల రేషనలైజేషన్కు సిగ్నల్స్ ఇవ్వడం, టీఆర్టీ–2017 పోస్టులను ఇప్పటికీ పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తే సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేసీఆర్ హామీ మేరకు మిగిలిపోయిన ఉర్దూ టీచర్ల పోస్టుల భర్తీ్కి నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత సాధారణ టీచర్ పోస్టుల భర్తీని పక్కన పెట్టాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. ప్రభుత్వం మారడంతో మరో డీఎస్సీ వేస్తామని ఇటీవల అక్కడి సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన సుమారు ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
సాంక్షన్ పోస్టులు 1.25 లక్షలు
ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లు 26,050 ఉండగా, వాటిలో 20,47,503 మంది చదువుతున్నారు. ఆయా బడుల్లో 1,03,049 మంది టీచర్లు పనిచేస్తుండగా, మరో 14 వేల మంది వరకూ విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఆగస్టులో చివరిసారిగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేశారు. తెలంగాణ వచ్చాక అభ్యర్థుల పోరాటం, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం 2017 అక్టోబర్లో కేవలం 8,792 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి స్టేట్లో సాంక్షన్టీచర్ పోస్టులు 1.25 లక్షల వరకున్నాయి. ఈ లెక్కన ఇంకా 20 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు. 2015లోనే 24,861 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ భర్తీ విషయానికొచ్చే సరికి పోస్టులను కుదించి చూపుతున్నారు. స్టూడెంట్స్, టీచర్ల నిష్పత్తి ఆధారంగా పోస్టుల భర్తీకి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
టెట్ వేస్తే టీఆర్టీ వేయాల్సి వస్తదని..
డీఈడీ, బీఈడీ చేసిన వాళ్లు టీఆర్టీ రాయాలంటే టెట్ పాసై ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి టెట్ పెట్టాలి. రాష్ట్రం ఏర్పడ్డాక ఆరేండ్లలో 12 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా రెండు సార్లే పెట్టారు. చివరిసారిగా 2017 జులై 23న టెట్ నిర్వహించగా సుమారు 4 లక్షల మంది రాశారు. టెట్పెడితే టీఆర్టీ వేయాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వస్తుందనే భావనతోనే ప్రభుత్వం టెట్ కూడా వేయడం లేదనే వాదనలు విన్పిస్తున్నాయి.
తగ్గుతున్న కాలేజీలు
రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ కాలేజీలు తగ్గిపోతున్నాయి. ఎల్పీ (లాంగ్వేజీ పండిట్)సెట్ నిర్వహించకపోవడంతో లాంగ్వేజీ కోర్సులను అందించే కాలేజీలన్నీ దాదాపు మూతపడ్డట్టే. డీఈడీ కాలేజీలదీ అదే దుస్థితి. స్టేట్లో 2015లో 212 ప్రైవేట్ డీఈడీ కాలేజీలుంటే ప్రస్తుతం173కు తగ్గాయి. వీటికి తోడు ఇక మేం నడపలేమంటూ 35 కాలేజీలు విద్యాశాఖకు అప్లికేషన్ పెట్టుకున్నాయి. బీఈడీ ప్రైవేట్ కాలేజీలు కూడా 2015లో 268 ఉంటే, ప్రస్తుతం 200లకు తగ్గాయి.
20 వేల పోస్టులతో టీఆర్టీ వేయాలె
సుమారు 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టూడెంట్స్ రేషియో చూపిస్తూ 10 వేల మంది టీచర్లు ఎక్కువున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇది నిజం కాదు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్లే స్టూడెంట్స్ చేరట్లే. మారుమూల గ్రామాల్లోని పిల్లలకు సర్కారు విద్యను దూరం చేస్తున్నారు.
– రవి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వీవీలున్నారంటే ఖాళీలున్నట్టేగా..
టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్తున్నరు. మరి 15 వేల మంది విద్యావలంటీర్లు ఎందుకు పనిచేస్తున్నరు. ఏపీలో ఇటీవలే టీచర్ పోస్టులను రెండుసార్లు భర్తీ చేశారు. మళ్లీ డీఎస్సీ వే స్తున్నారు. మన దగ్గర 2017 టీఆర్టీ పోస్టులనే ఇంకా భర్తీ చేయలే.
– రామ్మోహన్రెడ్డి, డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
స్టూడెంట్స్ తగ్గుదలపై స్టడీ చేయాలె
స్టూడెంట్స్ లేరనే సాకుతో సర్కారు స్కూళ్లను మూస్తున్నరు. అసలు స్టూడెంట్స్ ఎందుకు తగ్గుతున్నరో స్టడీ చేయడం లేదు. దీనిపై విద్యావేత్తలతో హైలెవెల్కమిటీ వేసి స్టడీ చేయించాలె. అంతేగానీ టీచర్ పోస్టులనే భర్తీ చేయమంటే ఎట్ల.
– ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ప్రతినిధి