
- 3 జిల్లాల్లో చేసిన సెరో సర్వేలో వెల్లడి
- అత్యధికంగా జనగామలో 18.2 శాతం
- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఇంకా ఎక్కువ ఉండే చాన్స్
- ఈనెల మూడో వారంలో మరోసారి సర్వే
హైదరాబాద్, వెలుగు: మాయదారి మహమ్మారి కరోనా.. రాష్ట్రంలో ఇంటింటికీ పాకింది. ఆగస్టు చివరి నాటికే ఏకంగా 46 లక్షల మందికి వచ్చిపోయింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సైంటిస్టులు చేసిన సెరో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో భాగంగా, ఆగస్ట్ 26, 27వ తేదీల్లో మన స్టేట్లో ఈ సర్వే నిర్వహించారు. కామారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లోని 30 గ్రామాల్లో సర్వే కోసం ర్యాండమ్గా 1,309 మందికి టెస్టులు చేశారు. 3 జిల్లాల్లో కలిపి 12.2 శాతం మందిలో ‘ఐజీజీ యాంటీబాడీస్’ ఉన్నట్టు తేలిందని ఎన్ఐఎన్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ యాంటీబాడీస్ ఉంటే వైరస్ వచ్చి పోయినట్టే లెక్క.జనగామ జిల్లాలో అత్యధికంగా 18.2 శాతం ఈ యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే, నల్గొండలో 11.1శాతం, కామారెడ్డిలో 6.9 శాతం మందికి పాజిటివ్ వచ్చాయి. ఈ లెక్కన రాష్ర్టంలోని 3.83 కోట్ల మంది జనాల్లో 46 లక్షల మంది ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నట్టేనని ఎన్ఐఎన్ సైంటిస్టులు ‘వెలుగు’కు తెలిపారు.
వచ్చి పోయిందని ఎట్ల తెలుస్తది?
మన శరీరంలోకి కరోనా ప్రవేశించగానే దానికి వ్యతిరేకంగా రోగనిరోధకశక్తి పోరాడుతుంది. వైరస్ సోకిన నాలుగైదు రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. వైరస్ను నాశనం చేసేందుకు ఇవి కొట్లాడుతాయి. ఇలా ముందుగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ను ‘ఐజీఎం యాంటీబాడీస్’ అని పిలుస్తారు. ఇవి 22 రోజుల దాకా శరీరంలో ఉంటాయి. వైరస్ సోకిన పది రోజుల తర్వాత ఐజీజీ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. రక్తంలోని సీరంను టెస్ట్ చేయడం ద్వారా ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఒకే టెస్టుతో రెండింటినీ పరీక్షించొచ్చు. టెస్టులో ఐజీఎం యాంటీబాడీస్ మాత్రమే పాజిటివ్ వస్తే, వైరస్ సోకి పది రోజుల లోపే అయినట్లు భావిస్తారు. ఐజీఎం, ఐజీజీ రెండూ పాజిటివ్ వస్తే వైరస్ సోకి10 నుంచి 25 రోజులు అవుతున్నట్టు లెక్క. కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే పాజిటివ్ వస్తే వైరస్ వచ్చి, తగ్గిపోతున్నట్టు లేదా పూర్తిగా నయమైపోయినట్టు భావిస్తారు. ఎన్ఐఎన్ సర్వేలో ఐజీజీ యాంటీబాడీస్ను డిటెక్ట్ చేసే టెస్టులు చేశారు. అంటే ఇందులో పాజిటివ్ వచ్చినోళ్లకు వైరస్ వచ్చి పోయినట్టే లెక్క.
మరిన్ని జిల్లాల్లో..
ఈ నెల మూడో వారంలో మరోసారి సెరో సర్వే చేపట్టే అవకాశం ఉందని ఐసీఎంఆర్ నోడల్ ఆఫీసర్, ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. జూన్లో తొలిసారి కామారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లో సర్వే చేపట్టగా, రెండోసారి కూడా ఇవే జిల్లాల్లో చేశారు. మూడో రౌండ్లో ఈ 3 జిల్లాలతోపాటు, మరికొన్ని జిల్లాల్లోనూ సర్వే చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తొలి రౌండ్ సర్వేలో ఒక్క జిల్లాలో 400 మందికి టెస్టులు చేయగా, జనగామలో 0.5 శాతం, నల్గొండలో 0.25 శాతం, కామారెడ్డిలో 0.25 శాతం మందికి మాత్రమే యాంటీబాడీస్ పాజిటివ్ వచ్చాయి.
ఇంకా ఎక్కువే!
దేశవ్యాప్తంగా 21 రాష్ర్టాల్లోని 70 జిల్లాల్లో ఈ సర్వే చేశారు. ఇందులో ప్రతి పది లక్షల మందిలో ఒక్కరి కంటే తక్కువ మందికి పాజిటివ్ వచ్చిన జిల్లాలు.. ప్రతి పది లక్షల మందిలో ఐదు లోపు కేసులు నమోదైన జిల్లాలు.. ఐదు నుంచి పది కేసులు నమోదైన జిల్లాలు.. పది కంటే ఎక్కువ కేసులు నమోదైన జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు. మన దగ్గర 3 జిల్లాలూ ప్రతి పది లక్షల మందిలో ఐదు కంటే తక్కువ కేసులు నమోదైన కేటగిరీలోనివేనని ఎన్ఐఎన్ సైంటిస్టులు వెల్లడించారు. ఈ 3 జిల్లాల్లోనే12.2 శాతం పాజిటివ్ ఉంటే, అత్యధిక కేసులు నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో ఇంతకుమించి పాజిటివ్ రేట్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 3.83 కోట్ల జనాభాలో ఇప్పటికే సుమారు కోటి మందికి కరోనా వచ్చిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.