- సివిల్ వింగ్లో 1991 నుంచి నో ప్రమోషన్
- స్టేట్ లో 5వేల హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ
- కేసుల సాకుతో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్
నారాయణ 1991 లో సివిల్ కానిస్టేబుల్ గా సెలక్టయ్యిండు. 30 ఏండ్ల సర్వీస్ కంప్లీటైంది. కానీ ఇంకా కానిస్టేబుల్ గానే పని చేస్తున్నాడు. అతనితోపాటే సెలక్టయిన ఏఆర్, స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం ప్రమోషన్లు వచ్చి ఆఫీసర్లు అయ్యారు. ముప్పైఏండ్లైనా ఎటువంటి ప్రమోషన్లు లేక మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ”
రమేశ్ 1991 లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా చేరాడు. ఆ తరవాత మూడు సార్లు ప్రమోషన్లు వచ్చాయి. మొదట సీనియర్ అసిస్టెంట్గా, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా, కొంతకాలానికి తహసీల్దార్గా ప్రమోట్ అయ్యాడు. రేపో మాపో మరో ప్రమోషన్ దక్కనుంది. ”
ఒకరు హోం డిపార్ట్మెంట్లో .. మరొకరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకే ఏడాది కొలువులో చేరారు. సివిల్ కానిస్టేబుల్ అదే క్యాడర్ లో ఉండగా.. రెవెన్యూ ఎంప్లాయ్ మాత్రం గెజిటెడ్ ఆఫీసర్ హోదాకు చేరుకున్నారు.
కరీంనగర్, వెలుగు:
ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా ఇప్పుడు ఒక్కటే చర్చ. మీ డిపార్ట్ మెంట్ లో ప్రమోషన్లు సంగతేందీ.. నీ కు ప్రమోషన్ వస్తుందా.. అన్న మాటలే వినిపిస్తున్నాయి. కానీ.. పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం తీవ్ర నిరాశతో ఉన్నారు. సివిల్ విభాగంలో కానిస్టేబుల్గా చేరిన వారెవరికీ 30 ఏళ్లుగా ఒక్క ప్రమోషన్కూడా రాలేదు. చాలామంది కానిస్టేబుల్గానే రిటైర్ అవుతున్నారు. స్టేట్లో 5వేలకు పైగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. కోర్టు కేసులు ఉన్నాయంటూ ప్రమోషన్ ప్రక్రియ నిలిపివేశారు. దీంతో ఈసారి కూడా ప్రమోషన్లు లేనట్టేనని పోలీసులు నిరాశ చెందుతున్నారు.
అర్హతలున్నా..
తెలంగాణలో సుమారు 40వేల మంది సివిల్ కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఇందులో 5వేల మంది వరకు హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు ప్రమోషన్ ఇవ్వడానికి అర్హత ఉన్నవారే. పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో చాలామంది ఈసారి ప్రమోషన్ వస్తుందని ఆశపడ్డారు. డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాల్లో ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టాలని డీజీపీ ఆఫీసు నుంచి సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అయితే కానిస్టేబుళ్ల ఆశలను సర్కారు నీరుగార్చింది. కోర్టులో కేసులున్నాయంటూ కానిస్టేబుళ్ల ప్రమోషన్లను ఆపేసింది. 1990 బ్యాచ్ వాళ్లకు మాత్రమే చివరిసారి ప్రమోషన్లు వచ్చాయి. 1991 తర్వాత రిక్రూట్ అయిన సివిల్ కానిస్టేబుళ్లకు ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. ఇతర డిపార్టమెంట్లలో తమతో పాటు జాయిన్వారు పెద్ద పొజిషన్లో ఉండగా.. తాము మాత్రం ఎక్కడికక్కడే మిగిలిపోవాల్సివచ్చిందని బాధ పడుతున్నారు. సొంత డిపార్ట్మెంట్లో కూడా ఏఆర్, స్పెషల్ పోలీసు విభాగాలకానిస్టేబుళ్లకు మాత్రమే ప్రమోషన్లు దక్కుతున్నాయి. ఏఆర్ లో 1998 వరకు ఎంపికయిన వారికి, ఎస్పీ విభాగంలో 2018 వరకు రిక్రూట్ అయినవారికే ప్రమోషన్లు వచ్చాయి.
ఏందీ కిరికిరి..
పోలీసు డిపార్ట్మెంట్లో టీఎస్ ఎస్పీ, ఏఆర్, సివిల్ అన్న మూడు విభాగాల్లో కానిస్టేబుళ్ల భర్తీ జరుగుతుంది. టీఎస్ ఎస్పీ, ఏఆర్ లలో రిక్రూట్ అయిన వారిలో కొందరిని సివిల్ విభాగానికి మారుస్తుంటారు. ఇలా కన్వర్షన్ అయిన వారికి అనుభవం ఎక్కువగా ఉండడంవల్ల డైరెక్టుగా రిక్రూట్ అయిన సివిల్ కానిస్టేబుళ్ల కన్నా ముందుగా ప్రమోషన్లు వస్తున్నాయి. దీనివల్ల సివిల్ కానిస్టేబుళ్లకు సినియారిటీ ఉన్నా ప్రమోషన్ లిస్టులో వెనకబడిపోతున్నారు. ఈ అంశం మీద సివిల్ కానిస్టేబుళ్లు కోర్టులో కేసు వేశారు. మూడేళ్ల నుంచి ఈ కేస్ నడుస్తుంది. దీంతో అప్పటి నుంచి కానిస్టేబుళ్ల ప్రమోషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏపీలో కేసులు ఉన్నా 2004 బ్యాచ్ వరకు ప్రమోషన్లు ఇచ్చేశారు. రెండు పార్టీలతో మాట్లాడి ఇరువురి సమ్మతితో ప్రమోషన్లు క్లియర్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ దిశగా చొరవ చూపాలని కోరుతున్నారు. ఈ నెల 20న కేసు బెంచ్ మీదకు వస్తుంది. మరి ఈ సారైనా తమకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని సివిల్ కానిస్టేబుళ్లు ఆశపడుతున్నారు.