హైదరాబాద్ మణికొండ పంచవతి కాలనీలో ‘కుంకుమపువ్వు’ సీరియల్ ఫేమ్ మధు ప్రకాష్ భార్య భారతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధుప్రకాశ్తో గుంటూరుకు చెందిన భారతికి 2015లో వివాహమైంది. ఆమె ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే తనను పట్టించుకోవడం లేదని, షూటింగ్ల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడంటూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భారతి.. మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
మధు ప్రకాష్ హత్య చేసి ఆత్మహత్యగా నమ్మిస్తున్నాడంటూ భారతి తల్లి ఆరోపిస్తున్నారు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయం అయినప్పటి నుంచి మధు ప్రకాష్కు తన కూతురును నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిపారు. రెండేళ్లుగా భారతిని వేధింపులకు గురి చేస్తున్నాడని…. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగితే సర్థిచెప్పే ప్రయత్నం చేశామని చెప్పారు. రూ.15 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసామని… చివరికి కూతురు చావుకు కారణం అయ్యాడన్నారు. కూతురి మృతికి కారణమైన మధు ప్రకాష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరో వైపు తన భార్య తనతో ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతుండేదని.. ఆత్మహత్య చేసుకుంటానని చాలా సార్లు బెదిరించిందని మధు చెబుతున్నాడు.