న్యూఢిల్లీ: ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేకు పార్లమెంటరీ కమిటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 15 రోజులలోపు ఆయన లేదా ట్విట్టర్ గ్లోబల్ టీమ్ కమిటీ ముందు కచ్చితంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. అంతే తప్ప మరే ఇతర అధికారులు వచ్చినా కమిటీ వారితో సమావేశం కాబోదని తీర్మానం చేసింది.
2019 లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ట్విట్టర్ వాడుతున్న భారతీయుల డేటా ప్రైవసీ, భద్రతపై వివరణ కోరుతూ ఫిబ్రవరి 1న ట్విట్టర్ సీఈవోకు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నోటీసు పంపింది. ఫిబ్రవరి 7న కమిటీ ముందు హాజరవాల్సిందిగా ఆదేశించింది. అయితే తొలుత తాము రాలేమని ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది.
కానీ మళ్లీ వచ్చేందుకు ఓకే చెప్పింది. అయితే సమయం సరిపోదని, గడువు పెంచాలని కోరింది. దీంతో ఫిబ్రవరి 11న కమిటీ ముందుకు రావాలని సూచించింది. అయితే ఈ రోజు ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు రావడంతో వారిని కలిసేందుకు పార్లమెంటరీ కమిటీ ఒప్పుకోలేదు. వారిని తిప్పి పంపేసింది.
ట్విట్టర్ సీఈవో లేదా గ్లోబల్ టీం రావాల్సిందేనని హెచ్చరించింది. మరో 15 రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోపు రాకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.